WorldWonders

ఇండియా గేట్‌కి చారిత్రక నేపథ్యం

ఇండియా గేట్‌కి చారిత్రక నేపథ్యం

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్‌కి చారిత్రక నేపథ్యం ఉంది. వీర జవానుల జ్ఞాపకార్థం ఇండియా గేట్‌ని నిర్మించారు. దీన్ని 1921 ప్రారంభించారు. 1931లో దీన్ని పూర్తి చేశారు. అంటే దీనికి పదేళ్లు పట్టింది. ఈ కట్టడం 138 అడుగుల ఎత్తు ఉంటుంది. పాలరాయి, ఇసుకరాయితో నిర్మించారు. ఎందుకు కట్టారంటే.. అప్పట్లో మనదేశం బ్రిటిష్‌వాళ్ల పాలనలో ఉండేది. బ్రిటిష్ వాళ్ల సైన్యంలో భారతీయులు కూడా ఉండేవాళ్లు. 1914 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికులు కూడా పాల్గొన్నారు.అలా బ్రిటిష్ వాళ్ల వైపు పోరాడుతూ సుమారు 70 వేల మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మొదటి ప్రపంచ యుద్ధంలో తమ విజయం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికుల గుర్తుగా ఏదైనా కట్టడాన్ని నిర్మించాలనుకున్నారు. ఈ ఆలోచనకు ఫ్రాన్సు దేశంలోని ‘తిగిఫ్ట్’ కట్టడాన్ని ప్రేరణగా తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన అఫ్గాన్ యుద్ధంలోనూ పది వేల వరకు మన జవానులు ప్రాణాలు విడిచారు. వారి జ్ఞాపకార్థంగానే ఈ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంపై యుద్ధంలో మరణించిన అమరజవానుల పేర్లు కూడా లిఖించారు.యుద్ధం చేస్తూ చనిపోయిన భారతీయ సైనికుల స్మృతి చిహ్నంగా దీన్ని నిర్మించారన్న విషయం గేట్ పైభాగంలో చెక్కి ఉంచారు. కట్టడాన్ని డిజైన్ చేసింది అప్పటి ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుట్యెన్స్. 1971లో జరిగిన భారత్ పాక్ యుద్ధం తర్వాత ఈ కట్టడం కింది భాగాన అమర్ జవాన్ జ్యోతిని ఏర్పాటు చేశారు. ఇది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. ఈ జ్యోతిని 1971లో భారత్ పాకిస్థాన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల స్మృతికి అంకితంగా వెలిగించారు. దీనికి కొంచెం దూరంలోనే 70 అడుగుల ఎత్తయిన ఎర్రరాయి మండపం ఉంటుంది. ఇందులో అప్పటి బ్రిటిష్ రాజు జార్జి- విగ్రహం ఉండేది. స్వాతంత్య్రం వచ్చాక ఆయన విగ్రహాన్ని తొలగించారు. ఏటా జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా జరిగే పరేడ్.. రాష్ట్రపతి భవన్ దగ్గర మొదలై ఇండియా గేట్ నుంచి సాగుతుంది.