DailyDose

విపణిలోకి మరో క్రేజీ బైక్-వాణిజ్య-04/02

honda cbr 150 2019

* రోడ్డు మీద ఎన్ని బైకులు రయ్‌మంటూ దూసుకెళుతున్నా ఏదైనా బైక్ కొత్తగా కనిపించిందంటే చాలు కుర్రకారు మనసు ఉవ్విళ్లూరుతుంటుంది. ఒక్కసారైనా దాని మీద రైడ్ చేయాలని ఉత్సాహపడుతుంటారు. అలాంటివారిని దృష్టిలో పెట్టుకునే మరో టూవీలర్‌‌ని తీసుకువచ్చింది ప్రముఖ వాహన తయారీ కంపెనీ హోండా సంస్థ. తాజాగా సీబీఆర్ 150 ఆర్ బైక్‌ను థాయ్‌లాండ్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఇక దీని ధర దాదాపు రూ.2.15 లక్షలు.
ఇందులో ఫీచర్స్ చూస్తే.. డ్యూయల్ చానల్ ఏబీఎస్ ఉంటుంది. ఇందులో కన్వెన్షనల్ ఫోర్క్స్ స్టాండర్డ్ ఫీచర్‌ ఉంటుంది. ముందు భాగంలో రెండు ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. సీబీఆర్ 650 ఆర్ బైక్‌ను ఇందుకు ప్రాతిపదికగా తీసుకున్నారు. ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా హోండా బ్రాండ్ పేరును తెలియజేస్తుంది.సీబీఆర్ 150 ఆర్ గ్రౌండ్ క్లియరెన్స్ 166 ఎంఎం. అంటే ఈ బైక్‌ను రోజువారీ కార్యకలాపాలకు వినియోగించవచ్చు. 149 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంటజ్ ఉంటుంది. మాగ్జిమమ్ పవర్ 17.1 హెచ్‌పీ @ 9000 ఆర్‌పీఎం. మాగ్జిమమ్ టార్క్ 14.4 ఎన్‌ఎం @ 7000 ఆర్‌పీఎం. ఆరు గేర్లు ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 12 లీటర్లు. బైక్ టాప్ స్పీడ్ గంటకు 135 కిలోమీటర్లు. త్వరలోనే భారత్ మార్కెట్లో ప్రవేశించనుంది.
* మార్చిలో దేశీయ వాహన విక్రయాలు ఓ మోస్తారుగా నమోదయ్యాయి. గత నెల దేశీయ అమ్మకాల్లో మారుతీ సుజుకీ స్వల్ప క్షీణతను నమోదు చేయగా.. హోండా కార్స్‌ విక్రయాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేయగలిగింది. మహీంద్రా అండ్‌ మహీంద్రా, టయోటా అమ్మకాలు స్వల్పంగా పెరిగాయి.
* విజయ, దేనా బ్యాంకుల విలీనంతో ప్రభుత్వరంగంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) అవతరించింది. విలీనమైన బ్యాంకుల శాఖలన్నీ బీవోబీ శాఖలుగా మారాయి. 9500 శాఖలు, 13400 ఏటీఎంలు బీవోబీ ఖాతాదార్లకు సేవలందించనున్నాయి. విజయ, దేనా బ్యాంకుల షేర్లు కలిగిన వారికి, బీఓబీ షేర్ల పంపిణీ సోమవారం పూర్తి చేసినట్లు బీఓబీ తెలిపింది.
* రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా వినోద్‌ కె. దాసరిని నియమించినట్లు ఐషర్‌ మోటార్స్‌ సోమవారం ప్రకటించింది.
* లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా విపిన్‌ ఆనంద్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎల్‌ఐసీ ఎండీగా ఆనంద్‌ను ప్రభుత్వం గత నెలలో నియమించింది.
* వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు 2018-19 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.11.77 లక్షల కోట్లకు చేరాయి. సవరించిన బడ్జెట్‌ అంచనాల (రూ.11.47 లక్షల కోట్ల) కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. మార్చిలో రికార్డు స్థాయిలో రూ.1.06 లక్షల కోట్లు వసూలు కావడం ఇందుకు ఉపకరించింది.
* ‘షేర్లు కొని, అమ్మేందుకు రుసుము లేదు.. లావాదేవీ ఎంతైనా, అతి తక్కువ రుసుము మాత్రమే..’ అంటూ జెరోధా వంటి కొత్తతరం బ్రోకరేజీ సంస్థలు చొచ్చుకుపోతున్నాయి.
* ప్రభుత్వ రంగ సంస్థ మాంగనీస్‌ ఓర్‌ ఇండియా (ఎమ్‌ఓఐఎల్‌) గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,440 కోట్ల రికార్డు టర్నోవరు లక్ష్యాన్ని సాధించినట్లు వెల్లడించింది.
* ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) గత ఆర్థిక సంవత్సరంలో రూ.19,400 కోట్లకు పైగా రికార్డు టర్నోవర్‌ను నమోదు చేసింది.
* విశాఖ ఉక్కు కర్మాగారం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సేల్స్‌ టర్నోవర్‌ రూ.20,844 కోట్లు నమోదు చేసినట్టు ఉక్కు సీఎండీ పి.కె.రత్‌ తెలిపారు. ఉక్కునగరంలో సోమవారం సంస్థ సీనియర్‌ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
* సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.25,828 కోట్ల టర్నోవర్‌ సాధించింది.
* ఎనిమిది కీలక మౌలిక రంగాలు నిరాశపరిచాయి. ఫిబ్రవరిలో మౌలిక రంగ వృద్ధి 2.1 శాతానికి పరిమితమైంది. ముడిచమురు, రిఫైనరీ ఉత్పత్తుల ఉత్పత్తి తగ్గడం ప్రతికూల ప్రభావం చూపాయి.
*గత ఆర్థిక సంవత్సరం (2018-19) మొత్తంగా చూస్తే మాత్రం విదేశీ మదుపర్లు నికరంగా రూ.44,500 కోట్లు ఉపసంహరించుకున్నారు.అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచడం, రూపాయి క్షీణత, ముడిచమురు ధరలు పెరగడం, దేశ కరెంటు ఖాతా లోటు పెరగడం, ద్రవ్య లోటు, కరెంటు ఖాతా లోటు లక్ష్యాలపై ఆందోళనలు, అమెరికా- చైనా వాణిజ్య ఉద్రిక్తతలు ఇందుకు తోడయ్యాయని విశ్లేషకులు వెల్లడించారు.
* కొత్త ఆర్థిక సంవత్సరంలో (2019-20) ఏప్రిల్‌ 1 నుంచి సరళీకరించిన జీఎస్‌టీ రిటర్ను ఫారాలను (సహజ్‌, సుగమ్‌) ప్రయోగాత్మకంగా అమల్లోకి తేవాలని జీఎస్‌టీ మండలి గత ఏడాది జులైలో నిర్ణయం తీసుకుంది.
*స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని బ్యాంకర్ల బృందం ఆధీనంలోకి వెళ్లిన జెట్‌ ఎయిర్‌వేస్‌ తాత్కాలిక మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌గా ఎస్‌బీఐ మాజీ ఛైర్మన్‌ ఏకే పుర్వార్‌ను నియమించేందుకు రుణదాతలు సన్నద్ధ మవుతున్నట్లు తెలుస్తోంది.
*పసిడి జూన్‌ కాంట్రాక్టు గతవారం రూ.32,402 వద్ద ఆరంభమైంది. ఆ తర్వాత సానుకూలంగా చలిస్తూ రూ.32,513 వరకు వెళ్లింది. ఇదే కాంట్రాక్టుకు వారం గరిష్ఠ స్థాయి. ఈ స్థాయిని నిలబెట్టుకోవడంలో కాంట్రాక్టు విఫలమైంది. దీంతో అమ్మకాల ఒత్తిడికి లోనై రూ.31,705 స్థాయికి పడిపోయింది. చివర్లో కాస్త పుంజుకోవడంతో నష్టాలు పరిమితమయ్యాయి.
ఈ వారం కూడా ఫార్మా రంగ షేర్లు లాభాలు కొనసాగించవచ్చు. అమెరికాలో కార్యకలాపాలు స్థిరత్వాన్ని సంపాదించుకుంటుండడం వల్ల సానుకూలతలు కొనసాగొచ్చు.
* ఐటీ షేర్లు స్తబ్దుగా ఉండొచ్చు. ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఈ ధోరణి కొనసాగొచ్చు. రూపాయి బలోపేతం అవుతుండడం వల్ల కూడా ఐటీ షేర్లు కొంత డీలా పడ్డాయి. మార్చి త్రైమాసిక ఫలితాలకు సిద్ధంగా ఉండే కొంత మంది మదుపర్లు ఐటీ షేర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది.
* జూన్‌-సెప్టెంబరు నైరుతి రుతుపవనాలపై కొంత ఆందోళనలున్న నేపథ్యంలో ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు కాస్త డీలా పడొచ్చు. ఈ ఏడాది ‘పెద్దగా సానుకూలంగా’ ఉండకపోవచ్చని ప్రైవేటు వాతావారణ ఏజెన్సీ స్కైమెట్‌ అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈనెల 3న ప్రకటించే అంచనాలు కీలకం కానున్నాయి.
* అక్టోబరు-డిసెంబరుతో పోలిస్తే జనవరి-మార్చిలో సిమెంటు కంపెనీల ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఈ వారం ఆ సంస్థల షేర్లు రాణించొచ్చు.
* వొడాఫోన్‌ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌లు తమ ప్రతికూల ధోరణిని కొనసాగించొచ్చు. ఈ రంగంలో టారిఫ్‌లపై అనిశ్చితి కొనసాగుతుండడం ఇందుకు నేపథ్యం. సాంకేతిక ఛార్టులపై భారతీ, వొడాఫోన్‌ ఐడియాలు బలహీనంగా కనిపిస్తుండగా..రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ప్రతికూల ధోరణితో ఒక శ్రేణికి పరిమితమై కదులుతున్నాయి.
* ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు చాలా తక్కువ శ్రేణికి లోబడి కదలాడొచ్చు. హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీఎల్‌ వంటి డౌన్‌స్ట్రీమ్‌ కంపెనీలు సానుకూల ధోరణితో; అప్‌స్ట్రీమ్‌ కంపెనీలు కొంత బలహీన ధోరణితో చలించే అవకాశం ఉంది.
* లోహ, గనుల తవ్వక కంపెనీల షేర్లు లాభాలు కొనసాగించొచ్చు. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చల ప్రగతిపై ఆశావహ దృక్పథం ఇందుకు నేపథ్యం.
*దేశీయంగా అతిపెద్ద బ్యాంకుల ఏర్పాటు ప్రణాళికలు అమలవుతున్నాయి. ఎస్‌బీఐలో 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంక్‌ విలీనం పూర్తవ్వగా, తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ)లో విజయ, దేనా బ్యాంకుల విలీనం నేటినుంచి అమల్లోకి రానుంది.