Politics

1.21 కోట్లు సమర్పయామీ

bjp spends 1.2cr inr on social media

మొదటి దశ లోక్‌సభ ఎన్నికలు ఇంకా వారంరోజులు మాత్రమే ఉండటంతో అధికార భాజపా సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేస్తోంది. గూగుల్‌తో పాటు యూట్యూబ్‌లాంటి దాని అనుబంధ ప్లాట్‌ఫారాల్లో ప్రకటనల కోసం రూ.1.21 కోట్లు వ్యయం చేసింది. కాంగ్రెస్‌ రూ.54,100 వ్యయం మాత్రమే చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్‌ 4 వరకు భారత్‌లోని వివిధ పార్టీలు, వాటికి సంబంధించిన ప్రకటనల ఏజెన్సీలు రూ.3.76 కోట్ల విలువైన ప్రకటనలు గుప్పించాయని పేర్కొంటూ గూగుల్‌ గురువారం ‘‘రాజకీయ ప్రకటనలపై పారదర్శక నివేదిక’’ను విడుదల చేసింది. ‘‘గూగుల్‌, యూట్యూబ్‌, మా అనుబంధ ప్లాట్‌ఫారాలపై రాజకీయ ప్రకటనల విషయమై పారదర్శకత ప్రదర్శించాలన్నదే మా లక్ష్యం. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి రాజకీయపార్టీ, రాజకీయ అభ్యర్థి లేదా ప్రస్తుత లోక్‌సభ అభ్యర్థి ఇచ్చిన ప్రకటనల వివరాలను నివేదికలో పొందుపరిచాం’’ అని గూగుల్‌ తెలిపింది. చంద్రబాబునాయుడు, తెదేపా తరఫున రెండు యాడ్‌ ఏజెన్సీలు ప్రకటనలు ఇచ్చాయి. ప్రామాణ్య స్ట్రాటజీ కన్సల్టెన్సీ రూ.85.25 లక్షలు, డిజిటల్‌ కన్సల్టింగ్‌ రూ.63.43 లక్షలు వ్యయం చేశాయి. వైకాపా రూ.1.04కోట్లు వ్యయం చేసింది. పమ్మి సాయిచరణ్‌రెడ్డి వైకాపా తరఫున రూ.26,400 ఖర్చు చేశారు.