Business

భారీగా పెరిగిన బంగారం ధర

gold price increased

బంగారం ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. డిమాండ్‌ లేమితో ఆ మధ్య కాస్త దిగొచ్చిన పసిడి ధర.. ఇటీవల మళ్లీ పెరుగుతూ పోతోంది. సోమవారం ఒక్క రోజే రూ. 425 పెరగడంతో పుత్తడి ధర మళ్లీ రూ. 33వేల మార్క్‌ను దాటింది. సోమవారం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి రూ. 33,215 పలికింది. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు దేశీయంగా నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో ఈ లోహం ధర పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వెండి కూడా నేడు బంగారం దారిలోనే పయనించింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో కేజీ వెండి ధర రూ. 170 పెరిగి రూ. 38,670కి చేరింది. అంతర్జాతీయంగానూ వీటి ధరలు స్వల్పంగా పెరిగాయి. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,298.30 డాలర్లు, ఔన్సు వెండి ధర 15.23 డాలర్లుగా ఉంది.