DailyDose

ముంబయిలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు-తాజావార్తలు–04/22

chandrababu to campaign in mumbai

* తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు రేపు మహారాష్ట్ర వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ముంబయిలో కాంగ్రెస్‌-ఎస్సీపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌, తమిళనాడులో కాంగ్రెస్‌-డీఎంకే పార్టీ అభ్యర్థులకు మద్దతుగా పలు బహిరంగసభల్లో సీఎం పాల్గొన్నారు. కర్ణాటకలోని మండ్యలో జేడీ(ఎస్‌) అధినేత, మాజీ ప్రధాని కుమారస్వామి మనవడు నిఖిల్‌తో పాటు చెన్నైలో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు ప్రచారం చేశారు. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆయన సభలు జరిగాయి.
* హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసనకు దిగారు. కార్యాలయం ముందు బైఠాయించారు.
* సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు.. పార్టీ గెలుపు అవకాశాలపై శాసనసభ, లోక్‌సభ అభ్యర్థులతో తెదేపా అధినేత చంద్రబాబు కాసేపట్లో సమీక్షించనున్నారు. పోలింగ్‌కు సంబంధించి బూత్‌ల వారీగా చర్చించనున్నారు. ఓట్ల లెక్కింపు జాగ్రత్తలపై అభ్యర్థులకు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. ఉండవల్లిలో జరుగుతున్న ఈ సమావేశానికి హాజరయ్యేందుకు పార్టీ నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు.
* అనంతపురం జిల్లా కేంద్రంలోని పాపంపేటలో నివాసముంటున్న సబ్‌ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణ నివాసంలో అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. కర్నూలు అనిశా డీఎస్పీ జయరామరాజ్‌, అనంతపురం డీఎస్పీ సురేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలతో కూడిన ప్రత్యేక బృందాలు ఐదు చోట్ల తనిఖీలు నిర్వహించాయి. లక్ష్మీనారాయణకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలపై సోదాలు నిర్వహిస్తున్నట్లు అనిశా అధికారులు పేర్కొన్నారు.
* హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫలితాల్లో గందరగోళాన్ని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసనకు దిగారు. కార్యాలయం ముందు బైఠాయించారు.
* తెలంగాణలో మే నెల 16 నుంచి 18వరకు పారా మెడికల్‌ డిప్లొమా పరీక్షలు జరగనున్నాయి. ప్రయోగ పరీక్ష మాత్రం మే 21 నుంచి జూన్‌ 5వరకు నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర పారా మెడికల్‌ బోర్డు కార్యదర్శి టి.గోపాలరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఏప్రిల్‌ 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
* ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని 16 జిల్లాల్లో 101 యూనిట్లలోపు విద్యుత్తు వాడుకునే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు బిల్లు నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 101 యూనిట్లలోపు విద్యుత్తు వాడుకునే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు తమ కుల ధ్రువీకరణ పత్రాలను సంబంధిత విద్యుత్తు రెవెన్యూ కార్యాలయం (ఈఆర్‌వో) లేదా సెక్షన్‌ (ఏఈ) కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఇచ్చిన అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
* బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ఈనెల 26న అల్పపీడనం ఏర్పడి, తరువాత అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌పై 1500 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనినుంచి విదర్భ, మరఠ్వాడాల మీదుగా ఉత్తర కర్ణాటక వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. అలాగే మరఠ్వాడా నుంచి దక్షిణ కర్టాటక వరకూ మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో తెలంగాణలో సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం రాత్రి 8 గంటల వరకూ 355 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. ఆదివారం పగటిపూట 96 ప్రాంతాల్లో వానలు పడ్డాయి. అత్యధికంగా రాజేంద్రనగర్‌లో 52.8, ఐజ 13.5, ఎదులగుట్టపల్లి 12.5, నల్లవెల్లి 10.5, బెల్లంపల్లిలో 11.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
* ఇంటర్‌ పరీక్ష ఫలితాలకు సంబంధించి రోజుకో బాగోతం వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకూ మార్కుల తేడాలు దర్శనమిచ్చాయి. కానీ ఇప్పుడు ఏకంగా గ్రూపే తారుమారు కావడం గమనార్హం.
* శ్రీలంక రాజధాని కొలంబో నుంచి కాస్త ముందు బయలుదేరడంతో తమకు ప్రాణాలు దక్కాయని జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లిలకు చెందినవారు అభిప్రాయపడ్డారు. శక్తిపీఠాన్ని దర్శించుకునేందుకు కోరుట్ల, మెట్పల్లికి చెందిన ఏడుగురు దంపతులు ఈనెల 17న శ్రీలంక వెళ్లారు. అమ్మవారి దర్శనానంతరం కొలంబోలోని వివిధ ప్రదేశాలను సందర్శించారు.
* పీజీ వైద్యవిద్యలో కన్వీనర్‌ కోటా కింద రెండో విడత ప్రవేశాల ప్రక్రియను ఈ నెలాఖరుకి నిర్వహించనున్నారు. తొలి విడత ప్రవేశాల్లో సీట్లు పొందిన అభ్యర్థులకు ఈ నెల 18నే కళాశాలల్లో చేరడానికి తుది గడువుగా నిర్ణయించడంతో, మలివిడత భర్తీపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం దృష్టిపెట్టింది.
* డిగ్రీ తరువాత పీజీ చేయలేని మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఉమెన్‌ సైంటిస్ట్స్‌ స్కీం’ (డబ్ల్యూవోఎస్‌-ఏ) పథకంపై ఈ నెల 23వ తేదీన హైదరాబాద్‌లో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. సాధారణ డిగ్రీ సహా బీటెక్‌ పూర్తి చేసిన మహిళలు ఈ పథకం ద్వారా ఉన్నత చదువులు చదువుకునే వీలుంటుంది. ప్రవేశపరీక్షలో అర్హత పొందిన వారికి నెలకు రూ. 30 వేల నుంచి రూ. 55 వేల ఉపకార వేతనం చెల్లిస్తారు.
* కరీంనగర్‌ సాహితీ గౌతమి కవి అంతరంగం పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కరీంనగర్‌ ఫిలింభవన్‌లో తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి రచించిన ‘నీటి మనసు’ సంకలనంపై కవి అంతరంగం కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. కవి అంతరంగంలో నందిని సిధారెడ్డి తన భావాలను పంచుకున్నారు.
* ఎన్నికల కంటే ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యమనేది ఎన్నికల సంఘం గుర్తించాలని మంత్రి అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఆదివారం నిర్వహించిన తెదేపా నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓట్ల లెక్కింపునకు మే 23వరకు గడువు ఉన్నందున అప్పటి వరకు అత్యవసర పనులకు ఆటంకం లేకుండా ఎన్నికల సంఘం అవకాశం ఇవ్వాలని కోరారు. ‘ఓట్ల లెక్కింపు వరకు అభివృద్ధి పనులపై సమీక్షలు వద్దంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో 10వేల మంది పని చేస్తున్నారు. దానిపై సమీక్ష వద్దంటే ఎలా’ అని ప్రశ్నించారు.
* గుహల్లో జీవ జాతుల వివరాలను సేకరించడం, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడం లక్ష్యాలుగా ఉన్న స్విట్జర్లాండ్‌కు చెందిన అంతర్జాతీయ సంస్థ ‘నేచర్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ యూనియన్‌ (ఐయూసీఎన్‌)’ ప్రతినిధిగా గుంటూరుకు చెందిన షాబుద్దీన్‌ ఎంపికయ్యారు. 35 దేశాల నుంచి 80 మంది శాస్త్రవేత్తలను సంస్థ ఎంపిక చేసిందని, అందులో భారతదేశం నుంచి తాను ఎంపికైనట్లు షాబుద్దీన్‌ తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ జంతుశాస్త్ర పరిశోధకుడిగా ఆయన పని చేస్తున్నారు.
* ఏపీ ఈసెట్‌-2019 హాల్‌టికెట్లను సోమవారం నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కన్వీనరు భానుమూర్తి తెలిపారు. ఈ నెల 30న 132 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నామని వెల్లడించారు. https://sche.ap.gov.in/ecet నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.
* రాష్ట్రంలో నాలుగు రకాల పార్టీలు పరిషత్‌ ఎన్నికల బరిలో నిలిచే అవకాశాలున్నాయి. గుర్తుల కేటాయింపుపై రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలను వెలువరించింది. స్వతంత్ర అభ్యర్థులకు ఇవ్వడానికి ఎంపీటీసీలకు 30, జడ్పీటీసీలకు 60 గుర్తులను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది.