Sports

మళ్లీ గిల్లిన గౌతీ

gambhir slams kohli

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌కోహ్లిని టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ మరోసారి విమర్శించాడు. కోహ్లి ఆర్సీబీకి మాత్రమే కెప్టెన్‌గా ఉండాలని, భారత జట్టుకు కాదుని ముందే సూచించానని గంభీర్‌ అన్నాడు. ఆర్సీబీకి కెప్టెన్‌గా ఉండటం నిజంగా కోహ్లి అదృష్టమని చెప్పుకొచ్చాడు. కోహ్లి ఉత్తమ ఆటగాడనేనని,, ప్రపంచంలోనే అతడ్ని మించిన బ్యాట్స్‌మెన్‌ లేరని, ఆ విషయంలో తానూ ఏకీభవిస్తానన్నాడు. కానీ కెప్టెన్సీలో మాత్రం కోహ్లి పనికిరాడని అభిప్రాయపడ్డాడు. ఏడేళ్ల పాటు ఒకే జట్టుకు కెప్టెన్‌గా ఉండి ఒక్కసారి కూడా టైటిల్‌ తీసుకురాలేదని, అయినా సారథిగా కొనసాగడం అదృష్టమేనని చెప్పుకొచ్చాడు. ఇక కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆరు వరుస ఓటములపై స్పందిస్తూ.. ‘కోల్‌కతా ఆటతీరు నన్నెంతో బాధిస్తోంది. ఏడేళ్ల పాటు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ప్రాణం పెట్టి ఆడాను. జట్టుకు ఆ పేరు తీసుకొచ్చేందుకు నా రక్తం ధారపోశాను. చాలా కష్టపడ్డాం.. అందుకే రెండు సార్లు ఛాంపియన్‌గా నిలవడంతో పాటు మూడు సార్లు ప్లే ఆఫ్స్‌కు కూడా చేరుకోగలిగాం’ అని గంభీర్‌ తెలిపాడు. ఇక గంభీర్‌ ఎప్పుడూ అభద్రతా భావంతో ఉండేవాడని, కానీ అది అతన్ని భారత గొప్పబ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు తెచ్చుకోవడంలో అడ్డుపడలేదని, భారత జట్టు మానసిక కోచ్‌ ప్యాడీ అప్టన్‌ ఇటీవల రాసిన బుక్‌లో పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యలు తననేమి బాధించలేదని గంభీర్‌ చెప్పుకొచ్చాడు. పైగా ప్యాడీ గొప్ప వ్యక్తని కొనియాడాడు. 2011 నుంచి 2017 వరకు కోల్‌కతా సారథిగా వ్యవహరించిన గంభీర్‌.. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు మారడంతో పాటు కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే, ఫామ్‌లేమితో పాటు జట్టు వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో సీజన్‌ మధ్యలోనే వైదొలిగాడు. ఈ ఏడాది క్రికెట్‌ ఇన్నింగ్స్‌ గుడ్‌బై చెప్పి రాజకీయ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. ప్రస్తుతం తూర్పు ఢిల్లీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.