Business

మూడో రోజు నాలుగు గంటల పాటు

ICICI Bank Chandha Kocchar Interrogated Third Day

వీడియోకాన్‌కు రుణాల మంజూరు వ్యవహారం, మనీ లాండరింగ్‌ కేసుల్లో ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందాకొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ వరుసగా మూడో రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈదీ) ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసుల్లో గత సోమవారం నుంచి వీరిద్దరినీ ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఖాన్‌ మార్కెట్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న కొచ్చర్‌ దంపతులను అధికారులు విచారిస్తున్నారు. గతంలో ఈ కేసుకు సంబంధించి ముంబయి, ఔరంగాబాద్‌ ప్రాంతాల్లో ఉన్న చందా కొచ్చర్‌, ఆమె కుటుంబ సభ్యులు, వీడియోకాన్‌ గ్రూప్‌నకు చెందిన వేణుగోపాల్ ధూత్‌ ఇళ్లలో సోదాలు చేసిన అనంతరం ముంబయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కార్యాలయంలో వారిని విచారించిన విషయం తెలిసిందే. వీడియోకాన్‌ గ్రూప్‌ రుణాల అవకతవకల వివాదం కారణంగా చందా కొచ్చర్‌ గత ఏడాది అక్టోబరులో ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు. 2012లో వీడియోకాన్ గ్రూప్‌ రూ.3,250 కోట్ల రుణాలు పొందిందని, దీని వల్ల కొచ్చర్‌ కుటుంబం లాభపడిందని ఆరోపణలు రావడంతో విషయం వివాదాస్పదమైంది. దీంతో వారిపై మనీ లాండరింగ్‌ క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.