Business

విద్యావంతులే కాదు ధనవంతులు కూడా వెళ్లిపోతున్నారు

Indian Millionaires Fleeing Country For Abroad - విద్యావంతులే కాదు ధనవంతులు కూడా వెళ్లిపోతున్నారు

కుబేరుల సంఖ్య ఏ ఏడాదికాఏడాది పెరుగుతూ వస్తుంటుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న భారత్‌లోనూ కొన్నేళ్లుగా సంపన్నులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే తాజా నివేదిక మాత్రం ధనవంతులు దేశం వీడి వెళుతున్నారని హెచ్చరిస్తోంది. గతేడాదిలో భారత్‌ నుంచి 5000 మంది మిలియనీర్లు(సంపన్నులు) దేశం వదిలి వెళ్లారు. మొత్తం సంపన్నుల్లో వీరి సంఖ్య 2 శాతానికి సమానం. ఇలా దేశం వదిలి వెళ్లిన మిలియనీర్ల సంఖ్య విషయంలో భారత్‌ మూడో స్థానంలో నిలవడం గమనార్హం. ఆఫ్రాసియా బ్యాంక్‌, పరిశోధక సంస్థ న్యూ వరల్డ్‌ వెల్త్‌లు రూపొందించిన గ్లోబల్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రివ్యూ(జీడబ్ల్యూఎమ్‌ఆర్‌)-2019 నివేదిక ఈ విషయాలను వెల్లడించింది. చైనా, రష్యాలు ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆ నివేదికలోని ఇతర ముఖ్యాంశాలు..
* బ్రిటన్‌తో పోల్చినా భారత్‌ నుంచే ఎక్కువ సంపన్నులు బయటకు వెళ్లడం గమనార్హం. ఆ దేశం బ్రెగ్జిట్‌ సంక్షోభంలో పడడం ఇందుకు నేపథ్యం. గత మూడు దశాబ్దాల్లో బ్రిటన్‌కు అత్యధిక సంఖ్యలో సంపన్నులు తరలిరాగా.. గత రెండేళ్లలో మాత్రం బ్రిటన్‌ నుంచి బయటకు వెళ్లడం మొదలైంది.
* అమెరికాతో వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కనిపిస్తోంది. అందుకేనేమో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. గత వారం చైనాపై అమెరికా తాజాగా పన్నులు విధించిన నేపథ్యంలో ఈ వలసలు మరింత పెరుగుతాయన్న అంచనాలున్నాయి.
* చైనా తర్వాత కుబేరుల వలసల విషయంలో రష్యా రెండో స్థానంలోకి చేరింది.
* అమెరికా, ఆస్ట్రేలియాలకు ఈ కుబేరులు ఎక్కువగా వలస వెళుతుండడం గమనార్హం.
* చైనా, భారత్‌ల నుంచి ధనవంతులు బయటకు వెళుతున్నా కూడా.. కొత్తగా అవతరిస్తున్న సంపన్నుల సంఖ్య వారి కంటే ఎక్కువగానే ఉండడం వల్ల పెద్దగా ఆందోళనపడాల్సిన అవసరం లేదు.
*2028 కల్లా నాలుగో సంపన్న దేశం మనదే..
‘భారత్‌లో అసమానతలు పెరుగుతుండడం కీలక సమస్యగా ఉంది. దేశంలోని సంపదలో ఈ సంపన్నుల వద్దే సగం ధనం ఉంది. ప్రపంచంవ్యాప్తంగా ఉన్న సంపదలో సంపన్నుల వద్ద 36 శాతం సంపద ఉండగా.. ఇది భారత్‌ విషయంలో 48 శాతంగా ఉంది. అయితే వచ్చే పదేళ్లలో మాత్రం భారత మొత్తం సంపద ఆకర్షణీయంగా పెరగనుంది. బ్రిటన్‌, జర్మనీలను తోసిరాజని 2028 కల్లా నాలుగో అత్యంత సంపద దేశంగా మారవచ్చ’ని ఆ నివేదిక వెల్లడించింది.
*ఫార్మా రాజధానిగా హైదరాబాద్‌! – వచ్చే పదేళ్లలో ఈ సంపద సృష్టికి దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలు కీలకంగా మారనున్నాయని ఆ నివేదిక చెబుతోంది. దిల్లీలో కీలక రంగాల్లో గణనీయ వృద్ధి కనిపించగలదని.. ఇక ఐటీ, ఆర్‌ అండ్‌ డీల్లో బెంగళూరు; ఔషధ రాజధానిగా హైదరాబాద్‌ వెలుగుతాయని అంచనా కట్టింది.