Politics

సర్వేలన్నీ సోది

Chandrababu on 2019 Exit Poll Surveys - tnilive - telugu news international

ఎన్నికల సందర్భంగా ఎగ్జిట్ పోల్స్, సర్వేలు సర్వ సాధారణమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గతేడాది ఇలానే సర్వేలు చేసి వైసీపీ వస్తుందని అన్నారు.. ఏమయిందని..? ప్రశ్నించారు. గత 35 ఏళ్లుగా టీడీపీ సర్వేలు చేయిస్తూనే ఉందనీ, అందులో భాగంగానే ఈ సారి కూడా సర్వేలు చేయించామని వెల్లడించారు. ‘ఇప్పుడు చెబుతున్నా.. రాసుకోండి మీరు.. నూటికి వెయ్యి శాతం గెలవబోయేది తెలుగుదేశం పార్టీ’ అని ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ సర్వీసులు రద్దు చేసినా.. ట్రైన్స్‌లో రిజర్వేషన్ లేకపోయినా.. హైదరాబాద్ నుంచి ఏ వాహనం దొరికితే అది ఎక్కి వచ్చి ఓటేశారని.. అన్నారు చంద్రబాబు.అలానే.. వీవీప్యాట్ల లెక్కింపు గురించి ప్రస్తావించిన ఆయన.. ముందు 5 వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించమన్న సుప్రీం.. మళ్లీ కేసు కోట్టేసిందన్నారు. కౌంటింగ్ విషయంలో అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే వీవీప్యాట్‌ స్లిప్పులపై నా డిమాండ్‌ను అందరూ ఒప్పుకొంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. మాజీ సీఈసీ ఖురేషి కూడా తన అభిప్రాయాలను సమర్థించారని.. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించాలని 23 పార్టీలు ఈసీకి విజ్ఞప్తి చేశాయని గుర్తు చేశారు. వీవీప్యాట్‌ స్లిప్పులను బాక్సులో వేసి లెక్కించేందుకు ఇబ్బంది ఏమిటి..?. వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించేందుకు ఎక్కువ సమయం అవసరం లేదని ఖురేషి చెప్పారని.. పారదర్శక విధానంతో ఓటర్లలో విశ్వాసం కల్పించాలని అన్నారు.ఎన్నికలు ఇలా జరుగుతాయని నేను ఊహించలేదు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు ముందు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడి ఆ తర్వాత ఢిల్లీ వెళ్తాను. అందరం చర్చించిన తర్వాతే రాష్ట్రపతిని కలిసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు.