*** 6000 దాటిన అతిథుల సంఖ్య
*** 2021 సభలు న్యూజెర్సీలో
*** సాంకేతిక దిగ్గజాలకు సత్కారం
*** వన్నె తెచ్చిన తమన్నా
*** మైమరిపించిన కీరవాణి
“మనమంతా తెలుగు-మనసంతా వెలుగు” స్ఫూర్తితో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో టెక్సాస్ రాష్ట్ర ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటరులో శుక్రవారం నుండి ప్రారంభమయిన మూడు రోజుల 6వ అమెరికా తెలుగు సంబరాలు ఆదివారం సాయంకాలం కీరవాణి సంగీత విభావరితో సందడిగా, సరదాగా సాగి ముగిశాయి. సాయంకాల కార్యక్రమాలు “జననీ జన్మభూమిశ్చ” అనే స్వాగతనృత్యంతో ప్రారంభమయ్యాయి. స్థానిక UTD విద్యార్థుల నాట్యాలు ఆకట్టుకున్నాయి. యాపిల్ మాజీ సీఈఓ, RxAdvance డైరక్టర్ల బోర్డు సభ్యుడు జాన్ స్కూలీ ఈ ముగింపు వేడుకలకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ తెలుగువారు అమెరికా అభివృద్ధికి శాస్త్ర సాంకేతిక రంగాల ద్వారా ఎంతో చేయూనతిస్తున్నారని, తమ సంస్థలోనే గాక 1983-93 కాలంలో తాను సీఈఓగా బాధ్యతలు నిర్వహించిన ప్రఖ్యాత దిగ్గజ సంస్థ యాపిల్ కంప్యూటర్స్లో కూడా ఎంతో మంది తెలుగువారు విశేష సేవలందిస్తున్నారని ఆయన కొనియాడారు. నాట్స్ వేడుకల్లో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని, చిన్నారుల నృత్యాలు తనను కట్టిపడేశాయని ఆయన అన్నారు. అనంతరం ఆయన్ను, RxAdvance సంస్థ CEO ఐకా రవిలను సినీ నటి తమన్నా, నాట్స్ BOD చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాస బాబు, సభల చైర్మన్ కంచర్ల కిషోర్, కార్యవర్గ సభ్యులు అప్పసాని శ్రీధర్, దేశు గంగాధర్, ఆలపాటి రవి, డా.కొడాలి శ్రీనివాస్, పిన్నమనేని ప్రశాంత్, మన్నవ మోహనకృష్ణ తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ సంబరాల విజయవంతానికి విశేష కృషి చేసిన నాట్స్ చైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్ దంపతులను నాట్స్ కార్యవర్గం ప్రత్యేకంగా అభినందించి సన్మానించింది. ఈసీ, BOD సభ్యులను సభకు రమేష్ నూతలపాటి, అప్పసాని శ్రీధర్లు పరిచయం చేశారు. సాయికుమార్ వ్యాఖ్యానంలో కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. జెమిని సురేష్, గిరిధర్ల హాస్య నాటిక నవ్వించింది. సినీ సంగీత దర్శక బాహుబలి కీరవాణి సంగీత విభావరి అతిథులను మైమరిపించింది. ముగింపు రోజున అతిథుల పోటు ఎక్కువ కావడంతో భోజనాల వద్ద విపరీతమైన రద్దీ ఏర్పడినప్పటికీ బావర్చి సంస్థ సరైన సమన్వయంతో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుని పసందైన భోజనాన్ని అందించింది. 2021 7వ అమెరికా తెలుగు సంబరాలు న్యూజెర్సీలో నిర్వహిస్తామని గుత్తికొండ శ్రీనివాస్ ప్రకటించారు.
*** 6000 మంది అతిథులే మా విజయం
నాట్స్ 6వ అమెరికా తెలుగు సంబరాల చైర్మన్ కంచర్ల కిషోర్ మాట్లాడుతూ 6నెలల పాటు వందల మంది వాలంటీర్లు శ్రమించి ఈ వేడుకలకు ప్రాణం పోశారని, 6000 మంది అతిథులు తమ ముగింపు వేడుకగా తరలివచ్చి నిలబడి సైతం కార్యక్రమాన్ని ఆస్వాదించడం తమ విజయంగా పరిగణిస్తున్నామని తెలిపారు. నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాసబాబు డల్లాస్ నాట్స్ బృందాన్ని, సభల విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.