Movies

అంత కొంప ఆ ఖాన్‌కి ఎందుకు?

Salman always wondered what would Sharukh do in Mannat

బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌కు ఉన్న స్థిరాస్తుల్లో అత్యంత విలువైనది అతడి ఇల్లే. ‘మన్నత్‌’గా పేరొందిన విలాసవంతమైన ఆ బంగ్లా ఖరీదు దాదాపు రూ. 200 కోట్లు ఉంటుందని అంచనా. సముద్ర తీరాన ఎంతో ఆహ్లాద వాతావరణాన్ని కలిగి ఉండే ఈ బంగ్లాను తొలుత సల్మాన్‌ ఖాన్‌ సొంత చేసుకోవాలని భావించాడట. అయితే తన తండ్రి వద్దని చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నాడట. ఈ విషయం గురించి సల్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ..‘ మన్నత్‌ను కొనుక్కోవాలనుకున్నాను. కానీ అంతపెద్ద ఇంటిని నువ్వు ఏం చేసుకుంటావు అని నాన్న గారు అనేసరికి వదిలేశాను. ఆ తర్వాత దానిని షారూఖ్‌ దక్కించుకున్నాడు. ఎప్పటి నుంచో నాకూ ఒక సందేహం ఉంది. షారూఖ్‌ అంతపెద్ద ఇంటిని ఏం చేసుకుంటాడా అని. ఈ విషయం గురించి తనను అడిగి డౌట్‌ క్లారిఫై చేసుకోవాల్సిందే’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా విలాసవంతమైన ఇంటిని కొనుక్కోవడం గురించి షారూఖ్‌ మాట్లాడుతూ..‘ నేను ఢిల్లీ నుంచి వచ్చాను. ఢిల్లీ వాళ్లకు బంగ్లాలో ఉండటమే ఇష్టం. కానీ ముంబైలో అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ ఉంటుంది. అందుకే సొంత ఇల్లు కొనాలని భావించాను. మొదట నా భార్య గౌరీతో కలిసి చిన్న ఇంట్లో ఉండేవాడిని. కొన్నేళ్ల తర్వాత మన్నత్‌ గురించి తెలుసుకుని.. దానిని సొంతం చేసుకున్నాను. నా జీవితంలో నేను కొన్న అత్యంత ఖరీదైన భవనం అదే అని చెప్పుకొచ్చాడు. కాగా ముంబైలో ఉన్న భారత కుబేరుడు ముఖేష్‌ అంబానీ ఇల్లు ‘అంటిల్లా’ ప్రపంచంలోనే రెండో ఖరీదైన ఇల్లుగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ‘అంటిల్లా’నిర్మాణ వ్యయం దాదాపు 14 వేల కోట్లు.