Movies

రాజకీయం వదలను

Vijayashanthi clarifies that she will still continue politics amidst movie roles

‘లేడీ అమితాబ్‌’ విజయశాంతి చాలా ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మహేశ్‌బాబు-అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించబోతున్నారు. చిత్ర బృందం ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే, తను ఇన్నేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రావడం పట్ల కొందరికి అనుమానాలు రావొచ్చని విజయశాంతి అన్నారు. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘నేను 13 ఏళ్ల తర్వాత సినిమాల్లో నటిస్తున్నానని ప్రకటించడంపై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంది. నేను మళ్లీ సినీ రంగ ప్రవేశం చేయడంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘సినిమాలలో నటించబోతున్నారు కాబట్టి ఇక రాజకీయాలను పట్టించుకోరేమో’ అని అనుకొంటున్నారు. ఈ సందర్భంగా నేను ఒక విషయం స్పష్టం చేయదలచుకున్నాను. నాకు సినిమాల్లో నటించే అవకాశం ఆరు నెలల కిందటే వచ్చింది. కానీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ హై కమాండ్ నాకు స్టార్ క్యాంపెయినర్, ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించింది’. ‘నాకు అప్పగించిన పని పూర్తయ్యేవరకు నేను సినిమాల్లో నటించడానికి అంగీకరించలేదు. అది రాజకీయాలపై నాకున్న అంకితభావం. నా రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ఇదే విధంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తే వాళ్లు కూడా ఉన్నారు. 2014-2018 వరకు కాంగ్రెస్‌లో రాములమ్మ చురుగ్గా లేరని కొందరు చేసిన కామెంట్స్ నా దృష్టికి వచ్చాయి. దీనికి కూడా సమాధానం చెప్పాలి అనుకుంటున్నా. పార్టీ అప్పగించిన పని ఏదైనా నేను చిత్తశుద్ధితో చేశాను. ఎన్నికలకు ముందు నాలుగేళ్లపాటు నేను పార్టీ చెప్పిన పనులను తూచా తప్పకుండా చేయడం వల్లే నాకు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించారనే విషయాన్ని గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీ కోసం చేసే పనులన్నీ ప్రజల్లోకి వచ్చి చేయకపోవచ్చు.. అంతమాత్రాన రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు భావించకూడదు’ అని విజయశాంతి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.