Devotional

ఆంధ్రాకు భద్రాచలం అప్పగింత?

Telangana Government Positive On Leaving Bhadrachalam To Andhra

*** తెలుగు రాష్ట్రాల మధ్య చర్చలు
*** ఇరువురు సిఎంలు సుముఖం
*** కేంద్రం సైతం సై

ప్రస్తుతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం గ్రామాన్ని నవ్యాంధ్రలో విలీనం చేసే అంశంపై రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు ప్రారంభమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. భద్రాద్రిని ఎపిలో కలిపే ప్రతిపాదనపై కేంద్ర సర్కారు సైతం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌తో ఇటీవల ఎపి ముఖ్యమంత్రి జగన్‌, తెలంగాణ సిఎం కెసిఆర్‌ రాజ్‌భవన్‌లో జరిపిన భేటీలో విభజన సమస్యల పరిష్కారంపై చర్చ సందర్భంలో భద్రాద్రి విలీన అంశం తెరమీదకొచ్చినట్లు తెలిసింది. భద్రాద్రిని ఎపిలో కలిపేందుకు తెలంగాణ సిఎం కెసిఆర్‌ ప్రాథమికంగా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. భద్రాద్రిని నవ్యాంధ్రలో కలపాలంటే పెద్ద తతంగం ఉంది. రెండు రాష్ట్రాల శాసనసభల్లో తీర్మానం ఆమోదించాలి. ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదించాలి. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్‌లో సవరించాలి. ఆ తరువాత రాష్ట్రపతి గజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం తలుచుకుంటే ఈ ప్రక్రియ పెద్ద కష్టమేం కాదని రాజ్యాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాఫీగా సాగేందుకు ఐదేళ్ల క్రితం ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఊరును మినహాయించి ఏడు మండలాలను ఎపిలో కలిపారు. కేవలం భావోద్వేగాల ప్రాతిపదికనే భద్రాచలం గ్రామాన్ని విలీనం నుంచి మినహాయించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కాగా ఏడు మండలాలను ఎపిలో కలపడంపై అప్పట్లో తెలంగాణ ఉద్యమ సంఘాలు, టిఆర్‌ఎస్‌ అభ్యంతరపెట్టాయి. ఇప్పుడు భద్రాద్రి ఊరును కూడా ఎపిలో కలిపితే ప్రజల నుంచి ఆందోళనలు వచ్చే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. 2014లో యుపిఎ-2 ప్రభుత్వం భౌగోళికంగా అప్పటికి తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాలనూ రీ-ఆర్గనైజేషన్‌ చట్టం ద్వారా ప్రత్యేక రాష్ట్రంగా విడగొట్టింది. రాజ్యసభలో బిల్లు పాసయ్యేదగ్గరకొచ్చేసరికి అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంకు ఎలాంటి అడ్డంకులూ లేకుండా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం మోడీ ప్రధాని కాగానే తొలి మంత్రివర్గంలోనే ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఎపిలో కలిపేందుకు వీలుగా రీ-ఆర్గనైజేషన్‌ యాక్టును సవరిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. తర్వాత పార్లమెంట్‌లో బిల్లు తెచ్చారు. ఇదిలా ఉండగా సమైక్య రాష్ట్రంలో ఎనిమిది మండలాలతో కూడిన భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ 1959కి పూర్వం ఆంధ్రా ప్రాంతంలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. తదుపరి పరిపాలనా సౌలభ్యం, రహదారి సంబంధాలు, గిరిజనులకు మౌలిక, ప్రాధమిక సదుపాయాలను మెరుగు పర్చే లక్ష్యంతో భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలో కలిపారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో పోలవరం కోసం భద్రాచలం ఊరు తప్ప మిగతా మండలమంతా, కూనవరం, విఆర్‌పురం, చింతూరు మండలాలను తిరిగి ఎపిలో కలిపారు. రామాలయం సెంటిమెంట్‌ రీత్యా భద్రాద్రి ఊరు మాత్రం తెలంగాణలో ఉంచి, చుట్టూ ఉన్న ప్రాంతమంతా ఎపిలో ఉండటంతో భద్రాచలం వాసులు పాలనాపరంగా ఇబ్బందులు పడుతున్నారన్నది రెండు ప్రభుత్వాల చర్చల సారాంశం. తెలంగాణ భూభాగంలో రాముడి దేవాలయం ఉండగా, గుడి మాన్యాలు ఎపిలో ఉన్నాయన్నది మరో వాదన. ఐటిడిఎ, విద్య, వైద్యం, మౌలిక వసతుల పరంగా ఏజెన్సీ గిరిజనులకు ఇబ్బందిగా పరిణమించిందనీ చెబుతున్నారు. ఈ కారణాలతో పాటు పోలవరం ప్రాజెక్టు దీర్ఘకాల ప్రయోజనాల రీత్యా భద్రాద్రి గ్రామాన్ని ఎపిలో కలపడర ఉత్తమమనే ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. భద్రాచలం పౌర సంఘాలు, వేదికలు తమ తమను ఎపిలో కలపాలని ఇప్పటికే తెలంగాణ సర్కారుకు విన్నవించుకున్నట్లు చెబుతున్నారు. రేపో మాపో ఆ సంఘాలు ఎపి సిఎం జగన్‌ను కలవనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఎపి పాలనకోసం పదేళ్లకు కేటాయించిన సచివాలయ భవనాలను ఎపి సర్కారు తెలంగాణకు ఇచ్చేసేందుకు సిద్ధపడిన సమయంలోనే భద్రాద్రిని ఎపిలో విలీనం చేసే అంశానికి బీజం పడినట్లు తెలుస్తోంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉమ్మడిగా వున్న పదవ షెడ్యూలు సంస్థల విభజన కూడా ఇంకా తేలవలసే వుంది.