ScienceAndTech

జులై 15న చంద్రయాన్‌-2

Chandrayan-2 To Be Launched On July 15th

చంద్రయాన్‌ -2ను జులై 15న ప్రయోగిస్తామని ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్‌ వెల్లడించారు. బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన చంద్రయాన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఇప్పటికే ఆలస్యమైనా.. పూర్తి స్థాయిలో సిద్ధమైందని పేర్కొన్నారు. జులై 15వ తేదీ తెల్లవారుజామున 2.51గంటలకు జీఎస్‌ఎల్‌వీ మార్క్‌(ఎంకే)-3 రాకెట్‌ సాయంతో ఈ మిషన్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రయోగం ద్వారా మీటరు పొడవైన 25 కేజీల బరువున్న రోవర్‌, ఆర్బిటర్‌, ల్యాండర్లను జాబిలిపైకి పంపనున్నట్లు తెలిపారు. ఈ ప్రయోగంలో జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 రాకెట్‌ సాయంతో శ్రీహరికోట నుంచి నింగిలోకి చేరుకొంటుంది. అక్కడి నుంచి ఆర్బిటర్‌ ప్రొపెలైజేషన్‌ విధానంలో ఈ మూడు పరికరాలు చంద్రుడి కక్ష్యలోకి చేరతాయి. అక్కడ ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయి జాబిలివైపు దూసుకెళుతుంది. ఆర్బిటర్‌ నిర్దేశిత కక్ష్యలో తిరుగుతుంది. మరోపక్క ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిర్దేశిత ప్రాంతంలో దిగుతుంది. అనంతరం దానిలోంచి రోవర్‌ బయటకు వచ్చి పరిశోధనలు ప్రారంభిస్తుంది. ఈ రోవర్‌ ప్రయోగాలు చేయడానికి అవసరమైన పరికరాలను కూడా ల్యాండర్‌పై భాగంలో అమర్చారు. సెప్టెంబర్‌ నుంచి ఇది సంకేతాలను ఇస్రోకు పంపనుంది.

*** చంద్రయాన్‌ 2 విశేషాలివీ!
* ఈ ప్రాజెక్టు అయ్యే ఖర్చు రూ.1,000 కోట్లు
* ఇస్రో వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన జీఎస్‌ఎల్‌వీ మార్క్‌-3 రాకెట్‌ను వాడుతున్నారు.
* దీనిలో ఉన్న ఆర్బిటర్‌, ల్యాండర్‌కు విక్రమ్‌.. రోవర్‌కు ప్రజ్ఞ అని పేరుపెట్టారు.
* చంద్రయాన్‌-2 మొత్తం బరువు 3.8టన్నులు.
* చంద్రయాన్‌లో మన ల్యాండర్‌, రోవర్‌ దిగే దక్షిణ ధ్రువ ప్రదేశానికి ఇంతవరకు ఏ దేశానికి చెందిన ఉపగ్రహాలు చేరలేదు.
* ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 13 రకాల పరికరాలను చంద్రుడిపైకి పంపిస్తున్నారు. వీటిసాయంతో చంద్రుడి ఉపరితలం, ఖనిజాలు వంటి వాటిని అన్వేషిస్తారు.
* నాసా సమకూర్చిన లేజర్‌ ర్యాంగింగ్‌ను ఉచితంగా చంద్రుడిపైకి తీసుకెళుతున్నారు.
* ఇది పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన ప్రాజెక్టు. నేవిగేషన్‌, గైడెన్స్‌ కోసం నాసా డీప్‌స్పేస్‌ నెట్‌వర్క్‌కు చెల్లింపులు జరిపి భారత్‌ వాడుకొంటుంది.
* ఇస్రో చేపట్టిన అత్యంత కఠినమైన ప్రాజెక్టు ఇదే. ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయేందుకు 15 నిమిషాల సమయం పడుతుంది. ఈ మొత్తం ప్రాజెక్టులో ఇదే అత్యంత కఠినమైంది. సెప్టెంబర్‌ 6న చంద్రుడిపై ఇది దిగుతుందని భావిస్తున్నారు.