Health

భారతదేశంలో శాంతి దొరకదు

India ranks 141 in peaceful countries on this planet-భారతదేశంలో శాంతి దొరకదు

శాంతియుత దేశాల జాబితాలో భారత్‌ స్థానం దిగజారింది. గతంతో పోలిస్తే ఐదు స్థానాలు పడిపోయి 141వ స్థానంలో నిలిచింది. మొత్తం 163 దేశాలకు సంబంధించి విడుదలైన గ్లోబల్‌ పీస్‌ ఇండెక్స్‌-2019 ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో ఐస్‌ల్యాండ్‌ ఎప్పటిలానే తొలి స్థానంలో నిలవగా.. అఫ్గానిస్థాన్‌ అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎకానమిక్స్‌ అండ్‌ పీస్‌ ఈ ర్యాంకులను ప్రకటించింది. సమాజ భద్రత, భద్రత స్థాయి, దేశీయ, అంతర్జాతీయ విభేదాలు, సైనికీకరణ వంటి పలు అంశాలను కొలమానంగా తీసుకుంది.ఈ నివేదిక ప్రకారం.. ఐస్‌ల్యాండ్‌ ప్రపంచంలోనే శాంతియుతంగా దేశంగా చోటుదక్కించుకుంది. 2008 నుంచి ఈ దేశానిదే తొలిస్థానం కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో న్యూజిల్యాండ్‌, ఆస్ట్రియా, పోర్చుగల్‌, డెన్మార్క్‌ ఉన్నాయి. అట్టడుగు దేశాల్లో అఫ్గానిస్థాన్‌ నిలిచింది. సిరియా స్థానాన్ని ముందుకు నెట్టి ఆ స్థానంలో అఫ్గాన్‌ చేరింది. ఇక దక్షిణ సూడాన్‌, యెమెన్‌, ఇరాక్‌ తర్వాతి అట్టడుగు దేశాల జాబితాలో నిలిచాయి. దక్షిణాసియా దేశాల విషయానికొస్తే భూటాన్‌ (15), శ్రీలంక (72), నేపాల్‌ (76), బంగ్లాదేశ్‌ (101) స్థానాల్లో నిలిచాయి. పొరుగుదేశం పాకిస్థాన్‌ 153వ ర్యాంకు దక్కించుకుంది. భారత్‌ సహా ఫిలిప్పీన్స్‌, జపాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, చైనా, ఇండోనేసియా, వియత్నాం, పాకిస్థాన్‌ వంటి 9 దేశాలు బహుళ ప్రకృతి వైపరీత్య ప్రమాదాలు పొంచి ఉన్న దేశాలుగా ఈ నివేదిక గుర్తించింది. ఇక భారత్‌, అమెరికా, చైనా, సౌదీ అరేబియా, రష్యా దేశాలు రక్షణ కోసం అధిక వ్యయం చేస్తున్న ఐదు దేశాలుగా పేర్కొంది. ప్రపంచంలో గత ఐదేళ్లతో పోలిస్తే ప్రపంచ శాంతి మెరుగుపడిందని, దశాబ్దంతో పోలిస్తే ఇంకా మెరుగుపడాల్సి ఉందని తెలిపింది.