Sports

పనీ పాటా ఏమి లేదా? ఏమిటీ చెత్త పనులు?

Sania Mirza Fires On Useless Ads Made On India Pakistan ICC CWC 2019 Match

చాలా కాలం తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానుల్లో అమితాసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన పలు టీవీ యాడ్‌లపై భారత టెన్నిస్ స్టార్‌ సానియా మిర్జా అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘సరిహద్దుకి అటు.. ఇటు.. ఇరు ప్రాంతాల్లో చిరాకు తెప్పించే ప్రకటనలు వస్తున్నాయి. సీరియస్‌గా చెబుతున్నాను. ఈ మ్యాచ్‌కు మీరు మరింత ప్రచారం కలిగించాల్సిన అవసరం లేదు.. ముఖ్యంగా చెత్త పనులతో. ఈ మ్యాచ్‌పై అభిమానులకు ఇప్పటికే కావాల్సినంతగా శ్రద్ధ ఉంది. ఇది అనూహ్య క్రికెట్‌ మ్యాచ్‌. ఇంతకన్నా ఎక్కువ అని మీరు భావిస్తుంటే, మీకు స్వీయ నియంత్రణ అవసరం. అనవసర విషయాలపై శ్రద్ధ పెట్టకండి’’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా, ఈ ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాక్‌ క్రికెట్ జట్ల మధ్య జూన్‌ 16న మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ ఛానెల్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఓ యాడ్‌ విడుదల చేసింది. భారత్‌ ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందంటూ వ్యంగ్యంగా దీన్ని రూపొందించిన విషయం తెలిసిందే. భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ వేషధారణలో ఉన్న ఓ వ్యక్తి పలు విషయాలను చెబుతున్నట్లు ఓ వీడియోను రూపొందించింది. మరోవైపు, భారత్‌లోనూ ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో టీమిండియా చేతిలో పాక్ గతంలో ఘోరంగా ఓడిపోయిన తీరును వివరించారు. వీటిపైనే సానియా మిర్జా మండిపడ్డారు.