తెలుగు అష్టావధాన చరిత్రలో తొలిసారిగా ఒకే వేదికపై ముగ్గురు అష్టావధానులతో నిర్వహించే త్రిగళ అష్టావధానానికి అమెరికా వేదిక కాబోతోంది. పృచ్ఛకులు అడిగే ఒక ప్రశ్నకు ముగ్గురు అవధానులు మూడు విధాలుగా పూరణలు చేయడం ఈ అవధానం ప్రత్యేకత. ప్రవాసాంధ్ర అవధాని పాలడుగు శ్రీచరణ్ సంస్కృతంలో, నేమాని సోమయాజులు సంస్కృతాంధ్ర భాషల్లో, డాక్టర్ పాలపర్తి శ్యామలానందప్రసాద్ అచ్చ తెలుగులో అవధానం చేయనున్నారు. ఈనెల 22న అట్లాంటాలోని అట్లాంటా లేక్ఫీల్డ్లోని బ్యాడ్మింటన్ క్లబ్ సమావేశ ప్రాంగణంలో, జులై 13న శాక్రిమెంటోలోని లక్ష్మీనారాయణ మందిరంలో ఈ అవధానాలు జరుగనున్నాయి. వాటిల్లో పాల్గొనేందుకు విజయవాడకు చెందిన అచ్చతెలుగు అవధాని ‘కాశీకవి’, ‘అసమాన అవధాన సార్వభౌమ’ డాక్టర్ పాలపర్తి శ్యామలానందప్రసాద్కు ఆహ్వానం అందింది. ఇతర భాషా పదాలేవీ వాడకుండా పూర్తిగా తెలుగు పదాలతో అవధానం చేసిన ఏకైక వ్యక్తిగా ప్రపంచ రికార్డు నెలకొల్పిన అవధానిగా శ్యామలానంద్ ఇప్పటికే అవధానరంగంలో దేశ, విదేశాల్లో వందలాదిగా అష్టావధానాలు, శతావధానాలు, ఒకేరోజులో సంస్కృతాంధ్రభాషలో శతావధానం చేసి తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేశారు. జులై, 4, 5, 6 తేదీల్లో జరిగే తానా సభల్లో కూడా పాలపర్తి ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు.
అట్లాంటాలో త్రిగళ అష్టావధానం
Related tags :