WorldWonders

భారత్ 8ఏళ్లల్లో దాటేస్తుంది-ఐరాస

Indian population will surpass China in 8 years says UNO

వచ్చే ఎనిమిదేళ్లలో చైనాను దాటేసి భారత్‌ అత్యధిక జనాభా గల దేశంగా నిలుస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. అప్పటి నుంచి దశాబ్దం చివరి వరకు అత్యధిక జనాభా గల దేశంగా భారత్‌ కొనసాగనుందని చెబుతోంది. 2019 నుంచి 2050 మధ్య దేశ జనాభా మరో 27.3కోట్లు పెరిగే అవకాశముందని ఐరాస తాజా నివేదికలో పేర్కొంది. ‘ది వరల్డ్‌ పాపులేషన్‌ ప్రాస్పెక్ట్స్‌ 2019: హైలైట్స్‌’ పేరుతో ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 7.7 బిలియన్లు ఉండగా.. 2050 నాటికి రెండు బిలియన్లు పెరిగి 9.7 బిలియన్లకు చేరనుందని ఐరాస అంచనా వేస్తోంది. ఇక ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచ జనాభా దాదాపు 11 బిలియన్లకు చేరే అవకాశాలున్నాయని నివేదికలో పేర్కొంది. కాగా.. ప్రపంచ జనాభా పెరుగుదలలో సగానిపైగా కేవలం 9 దేశాల్లోనే నమోదవుతుందని ఐరాస అంచనా వేస్తోంది. రానున్న 30ఏళ్లలో భారత్‌తో పాటు నైజీరియా, పాకిస్థాన్‌, డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ ది కాంగో, ఇథియోపియా, టాంజానియా, ఇండోనేషియా, ఈజిప్టు, అమెరికాలో జనాభా పెరుగుదల అత్యధికంగా ఉండనుందని ఐరాస నివేదిక తెలిపింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనా అగ్రస్థానంలో ఉంది. అయితే 2027 నాటికి చైనాను దాటేసి భారత్‌ అత్యధిక జనాభా గల దేశంగా నిలుస్తుందని ఐరాస అంచనాలు చెబుతున్నాయి. 143 కోట్ల మందితో చైనా, 137 కోట్ల మందితో భారత్‌ గత కొన్నేళ్లుగా అత్యధిక జనాభా గల దేశాలుగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. 32.9కోట్ల మందితో యూఎస్‌ఏ, 27.1కోట్ల మందితో ఇండోనేషియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే 2050 తర్వాత భారత్‌ అగ్రస్థానంలోకి వస్తుందని, ఆ తర్వాత చైనా, నైజీరియా, యూఎస్‌ఏ పాకిస్థాన్‌ అత్యధిక జనాభా గల మొదటి ఐదు దేశాలుగా ఉండనున్నాయని ఐరాస తన నివేదికలో పేర్కొంది.