DailyDose

22న సుబ్బారెడ్డి ప్రమాణం-తాజావార్తలు–06/19

YV Subbareddy To Take Oath As TTD Chairman On 22nd

* ఈ నెల 22వ తేదీన వైవిసుబ్బారెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే పలువురు టీటీడీ బోర్డు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీటీడీ బోర్డు కొత్త సభ్యులు కూడా అదే రోజు ప్రమాణ స్వీకరం చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
* పాకిస్తాన్‌ జట్టులో గ్రూప్‌ రాజకీయాలు చోటుచేసుకున్నాయా? ఆటగాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయారా? కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మాటను ఆటగాళ్లెవరు ఖాతరు చేయడం లేదా? అంటే అవుననే అంటున్నాయి.. పాక్‌ మీడియా వర్గాలు. పాక్‌ పేసర్‌ మహ్మద్‌ ఆమిర్‌, ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీంల నేతృత్వంలో ఆటగాళ్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయారని, కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మాటలను ఖాతరు చేయడం లేదని ఆ దేశ మీడియా కథనాలు వడ్డిస్తోంది.
* యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా గుండె జారి గల్లంతయ్యిందే ఫేం కొండా విజయ్‌ కుమార్ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కేకే రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు సంస్థ కార్యాలయంలో బుధవారం ఉదయం 8.30 గంటలకు జరిగాయి.
* యుపిలోని బుందేల్‌ఖండ్‌ ప్రాంతం బందా జిల్లాలో ఉన్న ‘కెన్‌’ నది వద్ద గత కొంతకాలంగా పోలీసు కాపలా కాస్తున్నారు. బందా జిల్లా వాసుల దాహార్తి తీర్చే ఏకైక నది కెన్‌. ఈ నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇసుక మాఫియా జోరుగా సాగుతోంది. ఇసుక కోసం నదీ మార్గాన్నే దారి మళ్లించడంతో ప్రజలు ఆందోళనకు దిగారు. ఈ నది నుంచి ఇసుకను తరలిస్తుండడంతో జిల్లా ప్రజలు తాగు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు పడి, తాగునీటి కష్టాలు తీరేవరకు తాము ఈ నదికి కాపలా కాస్తామని పోలీసు తేల్చి చెప్పారు. ఈ నది నుంచి ఇసుక అక్రమంగా తరలించే వారి భరతం పడుతామని వారు హెచ్చరించారు. కెన్ నదికి పోలీసులు కాపలాగా ఉండడంతో బందా జిల్లా ప్రజలు కాసింత ఊపిరి పీల్చుకున్నారు…
* ఓ రైతు పొలాన్నిదున్నుతుండగా పంచలోహ విగ్రహాలు బయటపడిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పుదుక్కోటై జిల్లా తిరుమయ్యం గ్రామంలో ఓ రైతు తన పొలాన్ని దున్నుతుండగా విగ్రహాలు బయటపడడంతో విగ్రహాలకు సమీపంలో పెద్ద చెట్టు ఉంది. అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని వృక్షాన్ని తొలగించారు. దీంతో మొత్తంగా 17 విగ్రహాలు, ఓ పీఠం లభించాయి. పురావస్తు శాఖ అధికారులు విగ్రహాలు పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వందేళ్లకు పైబడిన విగ్రహాలని తెలిపారు. విగ్రహాల విలువ కోట్లలో ఉంటుందని అధికారులు వెల్లడించారు.
* బీహార్‌ కు మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. మెదడు వాపు లక్షణాలతో ఇప్పటి వరకు వ్యాధితో చనిపోయిన చిన్నారుల సంఖ్య 112 కు చేరింది. పసి మొగ్గలు రాలిపోవడానికి కారణాలేమిటని.. దేశ నలమూలల నుండి వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలను కేంద్రం బీహార్‌ కు పంపిస్తోంది. ఆస్పత్రుల్లో ఈ లక్షణాలతో చేరే పిల్లలకు వేగంగా చికిత్స అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయినప్పటకీ.. మరణాలు తగ్గకపోవడంతో ప్రజల్లో ఆందోళన, ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి.
* అధికారుల నిర్లక్ష్యానికి కృష్ణయ్య అనే రైతు వంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన తన భూమిని వేరేవారి పేరుత ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో అధికారులను ఆశ్రయించాడు. అధికారులు స్పందించకపోవడంతో ఉర్కొండ మండలం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట కుటుంబంతో కలిసి రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. అధికారులు వెంటనే స్పందించి భూమిని తన పేరుమీద రాయాలని డిమాండ్ చేశాడు.
* తెలంగాణలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ ఎడ్‌సెట్‌ ఫలితాలను ఇవాళ మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సెట్‌ కన్వీనర్‌ ప్రొ.మృణాళిని తదితరులు పాల్గొన్నారు.
* రాష్ట్రంలోని ఇంజినీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన టీఎస్ పీజీఈసెట్-2019 ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. ఈ మేరకు సెట్ కన్వీనర్ ప్రొ.కుమార్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు.
*గూడ్సు బండి, సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్..రైలు ఏదైనా, ఎక్కువ బోగీలూ వ్యాగన్లతో అది వెళ్లాలన్నా, పట్టాలపై వేగంగా పరుగులు తీయాలన్నా ఇంజిన్, దాని సామర్థ్యమే కీలకం. ఇప్పటివరకు దేశంలో ఉన్న ఇంజిన్ల అత్యధిక సామర్థ్యం 4000 అశ్విక శక్తి(హార్స్ పవర్). వీటన్నింటినీ తలదన్నేలా ఎకాయెకి 6000 అశ్విక శక్తి సామర్థ్యంతో డబ్ల్యూడీజీ-6జి లోకోమోటివ్లను త్వరలోనే పట్టాలకు ఎక్కించాలన్నదే రైల్వేశాఖ నిర్ణయం.
*బంగాళాఖాతం ఉత్తర ప్రాంతంలో మూడు, నాలుగు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు.
*పట్టణాలు, మెట్రో నగరాల్లో ఏటికేడు పెరిగిపోతున్న మురికివాడలను తగ్గించడానికి ఏక గది (సింగిల్ రూమ్) ఫ్లాట్ల నిర్మాణం చేపట్టాలని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ యోచిస్తోంది.
*గ్రామ పంచాయతీలకు ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరంలో పుష్కలంగా నిధులు లభించబోతున్నాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం నుంచి రెండు విడతల్లో రూ.1,628 కోట్లు గ్రామాలకు రానున్నాయి.
*బహుళార్థ సాధక ప్రాజెక్టు కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయని అని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం పేర్కొంది. ఎవరెన్ని విమర్శలు చేసినా నీళ్లు, నిధులు, నియామకాల కోసం చేసిన తెలంగాణ ఉద్యమం అనంతరం సాధించుకున్న బృహత్తరమైన వనరు ఈ ప్రాజెక్టు అని పేర్కొంది.
*రాష్ట్రవ్యాప్తంగా 300 ఖాళీలను ఏజెన్సీల ద్వారా పొరుగుసేవల (ఔట్సోర్సింగ్) విధానంలో భర్తీ చేయాలని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ప్రక్షాళన చర్యల్లో భాగంగా ఇటీవల అనధికార ప్రైవేటు సిబ్బందిపై రిజిస్ట్రేషన్ శాఖ వేటు వేసింది.
*ఎమ్మార్ కుంభకోణం వ్యవహారంలో నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.
*తెలంగాణ రాష్ట్రానికి 2018 సంవత్సరం బ్యాచ్కు చెందిన ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను కేంద్రం కేటాయించింది. రాష్ట్రానికి కేటాయించిన ఎనిమిది మంది ట్రైనీ ఐఏఎస్ అధికారుల్లో ముగ్గురు రాష్ట్రానికి చెందిన వారు కాగా మిగిలిన ఐదుమంది అధికారులు వేర్వేరు రాష్ట్రాలకు చెందినవారు.
*ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తులుగా తాజాగా నియమితులైన ఇద్దరి ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం హైకోర్టులో జరగనుంది. కొత్తగా నియమితులైన మానవేంద్రనాథ్రాయ్, ఎం.వెంకటరమణతో గురువారం ఉదయం 10.55 గంటలకు హైకోర్టు జడ్జిలుగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ సి.ప్రవీణ్కుమార్ ప్రమాణం చేయిస్తారు.
*రాష్ట్ర పరిధిలోని విశ్వవిద్యాలయాల్లో 2019 – 20 విద్యా సంవత్సరానికి బడ్జెట్పై విస్తృతస్థాయి సమావేశం ఈ నెల 21న సచివాలయంలోని ఫైనాన్స్ కాన్ఫరెన్స్ హాలులో జరుగుతుందని వర్సిటీ రిజిస్ర్టార్ ఆచార్య జి.రోశయ్య తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ఆచార్య ఎస్.వరదరాజన్ నుంచి వర్సిటీకి లేఖ వచ్చినట్లు తెలిపారు. ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరి ఆధ్వ ర్యంలో జరిగే సమావేశానికి వర్సిటీకి సంబంధించిన బడ్జెట్ ప్ర తిపాదనలను వారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.