WorldWonders

వాళ్ల డాంబికానికి పర్యావరణం చెడిపోయింది

Gupta Family Wedding In Uttarakhand Created 40Tonnes Of Waste

‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్లు ఉత్తరాఖండ్‌లోని ఔలీ ప్రాంతంలో ఇటీవల ఓ అపర కుబేరుల ఇంట్లో జరిగిన పెళ్లి అక్కడి మున్సిపాలిటీ అధికారులకు తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ వివాహ వేడుకతో ఔలీలో చెత్త పేరుకుపోయింది. దాన్ని శుభ్రం చేసేందుకు పురపాలక అధికారులు నానా పాట్లు పడుతున్నారట. అసలేం జరిగిందంటే….భారత్‌కు చెందిన గుప్తా కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితమే దక్షిణాఫ్రికాలో స్థిరపడింది. అనేక వ్యాపారాలు చేస్తూ సంపన్న కుటుంబంగా ఎదిగింది. ఇటీవల గుప్తాల ఇంట్లో రెండు పెళ్లిళ్లు జరిగాయి. ఉత్తరాఖండ్‌లోని ఔలీ ప్రాంతంలో బిలియనీర్‌ అజయ్‌ గుప్తా కుమారుడు సూర్యకాంత్‌ వివాహం జూన్‌ 18-20 మధ్య, అజయ్‌ సోదరుడు అతుల్‌ గుప్తా కుమారుడు శశాంక్‌ వివాహం జూన్‌ 20-22 మధ్య జరిగింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బాలీవుడ్‌ నటులు, యోగా గురు బాబా రాందేవ్‌ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. పెళ్లి వేడుకల కోసం ఔలీలోని హోటళ్లు, రిసార్టులను గుప్తా కుటుంబం బుక్‌ చేసుకుంది. దాదాపు రూ. 200కోట్లు ఖర్చుపెట్టి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. అయితే, ఈ వేడుకల తర్వాత ఔలీలో ఎక్కడ చూసినా చెత్తే కన్పిస్తోందట. ప్లాస్టిక్‌ ప్యాకెట్లు, బాటిళ్లు ఎక్కడపడితే అక్కడ పడేశారట. గుప్తాల వివాహం వల్ల 40 క్వింటాళ్లపైనే చెత్త పోగైనట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. ఈ చెత్తను శుభ్రం చేసేందుకు 20 మందితో బృందాన్ని నియమించినట్లు చెప్పారు. కాగా, గుప్తాల వివాహ వేడుకపై ఇటీవల న్యాయస్థానంలో పిటిషన్‌ కూడా దాఖలైంది. ఈ వేడుకలతో ఔలీలో పర్యావరణానికి హాని కలుగుతుందని పిటిషన్‌దారులు పేర్కొన్నారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. పర్యావరణ కాలుష్యం జరగకుండా చూసుకోవాలంటూ గుప్తా కుటుంబాన్ని సూచించింది. మరోవైపు గుప్తా కుటుంబం పెళ్లి వేడుకలపై వస్తున్న ఆరోపణలను రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ కొట్టివేశారు. పైగా ఈ పెళ్లితో ఔలీ పర్యాటక ప్రాంతంగా మారిందని సీఎం చెప్పడం గమనార్హం.