DailyDose

అమెరికా స్టాక్ మార్కెట్‌‌లో ఫ్లిప్‌‌కార్ట్-వాణిజ్యం–06/25

Flipkart Comes To USA Stock Market-June 25 2019-Daily Business News

* దేశీయ ఆన్లైన్ కంపెనీ ఫ్లిప్‌‌కార్ట్ అందరికీ సుపరిచితమే. ఈకామర్స్ వ్యాపారాల్లో ఫుల్ పాపులర్ అయిన ఫ్లిప్‌‌కార్ట్‌‌ను, అమెరికన్ రిటైల్ అగ్రగామి వాల్‌‌మార్ట్ చేజిక్కించుకున్న సంగతీ తెలిసిందే. వాల్‌‌మార్ట్‌‌ సొంతం చేసుకున్న ఫ్లిప్‌‌కార్ట్ ఇక ఇప్పుడు అమెరికా ఈక్విటీ మార్కెట్‌‌లో లిస్ట్‌‌ కాబోతుంది. 2022 నాటికి ఫ్లిప్‌‌కార్ట్, అమెరికా స్టాక్ మార్కెట్‌‌లో అడుగుపెడుతుందని, ఈ మేరకు ఫ్లిప్‌‌కార్ట్ బోర్డు ఈ నెల మొదట్లో నిర్ణయం తీసుకున్నట్టు ఈ విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు.
* చేతులెత్తేసిన బీఎస్ఎన్ఎల్: 1.76 లక్షల మందికి జూన్ వేతనాలివ్వలేం…….
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) మరోసారి ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. ఆర్థిక సంక్షోభం వల్ల జీతాలు చెల్లించలేమంటూ మరోసారి చేతులెత్తేసింది. మూడు దశాబ్దాల క్రితం వరకు ఇంటింటికి ఫోన్ సౌకర్యం కల్పించి ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తమకు ద్రవ్యసహాయం చేయకుంటే సిబ్బంది జూన్‌ నెల జీతాల చెల్లింపు కష్టమేనంటోంది. చెల్లించాల్సిన బాకీలు సుమారు రూ.13 వేల కోట్ల ఉన్నాయని, ఈ క్రమంలో సిబ్బంది జీతాల కోసం దాదాపు 850 కోట్ల సేకరణ అసాధ్యం అంటున్నారు ఆ శాఖ అధికారులు. తమకువచ్చే ఆదాయానికి, ఖర్చులకు మధ్య అంతరం చాలా ఉందని ప్రభుత్వం ఆదుకోకుంటే ఇంకా దీనిని నడపడం కష్టమేనంటున్నారు సదరు సంస్థ బడ్జెట్‌, బ్యాంకింగ్‌ డివిజన్‌ సీనియర్‌ మేనేజర్‌ పూరన్‌చంద్ర. ఉన్న సమస్యలన్నీ ఏకరవు పెడుతూ టెలికం శాఖకు లేఖను కూడా పంపినట్లు తెలిపారు. ఇక ప్రభుత్వం తీసుకోబోయే సంస్కరణ చర్యలపైనే బీఎస్‌ఎన్‌ఎల్‌ భవితవ్యం ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు.ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ రూ. 90 వేల కోట్ల నిర్వహణా నష్టంతో కొనసాగుతుంది. నిర్వహణా లోపం, ఉద్యోగులకు ఇచ్చే అధిక వేతనాలు, అనవసర విషయాలలో ప్రభుత్వ అధికారుల జోక్యం, టెలికాం రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ప్రణాళికలు లేకపోవటం వెరసి నష్టాల్లో కూరుకున్నది. ఈ సంస్థ ఆర్థిక సంవత్సరం 2018 కి సంబంధించి తన ఆదాయంలో 21 శాతాన్ని ఉద్యోగుల జీతాలు, ప్రయోజనాలకు ఖర్చు చేయగా.. ప్రైవేటు సంస్థ ఎయిర్‌టెల్‌ తన ఆదాయంలో కేవలం 3 శాతమే ఖర్చు చేసింది. దేశంలో ఉన్న ఫోన్‌ వినియోగదారుల్లో కేవలం 10 శాతం మాత్రమే బీఎస్ఎన్ఎల్ చందాదారులుగా ఉన్నారు.
మిగతా వారంతా ప్రైవేట్ టెలికాం వినియోగదారులే. ప్రధాని మోదీ అధ్యక్షతన దీనిపై ఒక సమీక్షా సమావేశం జరిగినా కచ్చితమైన పరిష్కార మార్గాలు మాత్రం చూపలేదు. మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ పరిధి 5G కి అప్‌గ్రేడ్‌ అవుతున్న ఈ తరుణంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇలాగే కొనసాగితే దాని మనుగడ కష్టమే అని టాటా సంస్థ అనుబంధ సంస్థ వీఎస్‌ఎన్‌ఎల్‌ మాజీ ఛైర్మన్‌ బి.కె సింఘాల్‌ అంటున్నారు.వేల కోట్లు బకాయిలతో బాధపడుతున్న టెలికాం సంస్థ ఇటీవల సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో చిక్కుకుంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం సంస్థ తన చరిత్రలో తొలిసారిగా సుమారు 1.76 లక్షల మంది ఉద్యోగులకు ఫిబ్రవరి వేతనాలను చెల్లించలేకపోయింది. భారీ నష్టాలను నమోదు చేస్తున్న ప్రభుత్వరంగ సంస్థల్లో టాప్‌లో ఉన్న బీఎస్ఎన్ఎల్‌ రూ.13,000 కోట్ల రుణ సంక్షోభంలో పడి పోయింది. డిసెంబర్ 2018 నాటికి నిర్వహణ నష్టాలు రూ.90,000 కోట్లకు పైగా మాటేనని సమాచారం.
*ఆంధ్రా బ్యాంకు రూ.2000 కోట్ల మూలధన నిధులు సమీకరించనుంది. దీని కోసం సంస్థాగత మదుపరులకు క్యూఐపీ పద్ధతిలో కానీ లేదా ఎఫ్పీఓ (ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్) లేదా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ పద్ధతిలో ఈక్విటీ షేర్లను ముఖ విలువ (రూ.10) కు కొంత ప్రీమియం నిర్ణయించి జారీ చేస్తారు.
*ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కేపీఆర్ అగ్రోకెమ్ లిమిటెడ్ తొలిసారిగా పబ్లిక్ ఇష్యూకు (ఐపీఓ) వస్తోంది.
*దేశంలో 5జీ సేవల ప్రారంభానికి, భారీఎత్తున ఫైబర్ కేబుల్ వేయాల్సిన అవసరం ఉందని క్రిసిల్ పేర్కొంది.
*సాధారణంగా ఏ దేశంలో అయినా సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఆశించేది పన్ను రాయితీలే.. ఇందుకు భిన్నంగా ‘అత్యంత సంపన్నులపై మరింత పన్నులు విధించండి.. వాతావరణ మార్పులపై పోరాటానికి, ఇతర ప్రాధాన్యతలకు ఆ మొత్తాన్ని వెచ్చించండి’ అంటూ స్వచ్ఛందంగా అమెరికా అధ్యక్ష అభ్యర్థులను లేఖ రాశారు, అక్కడి కుబేరులు.
*దేశీయంగా మే నెలలో అత్యధికంగా విక్రయమైన ప్రయాణికుల వాహన మోడళ్లలో మారుతీ సుజుకీవే అత్యధికం ఉన్నాయి.
*అవయవదానాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో అపోలో హాస్పిటల్స్, ఇండియన్ మెడికల్ అసోషియేషన్ (ఐఎంఏ)కు చెందిన మహిళా విభాగంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది.
*హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇండియన్ ఇమ్యునలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) హైదరాబాద్ శివార్లలోని కర్కపట్ల యూనిట్లో రూ.75 కోట్ల పెట్టుబడితో నూతన స్టెరైల్ ఫిల్లింగ్ ఫెసిలిటీ (ఎస్ఎఫ్ఎఫ్) ని ఏర్పాటు చేయనుంది.
*వరుసగా రెండో రోజూ సూచీలు నష్టపోయాయి. అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు, లోహ షేర్లకు అమ్మకాలు వెల్లువెత్తాయి. రుతుపవనాల పురోగతిపై ఆందోళనలు, మిశ్రమ అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్పై ప్రతికూల ప్రభావం చూపాయి. డాలర్తో పోలిస్తే రూపాయి 23 పైసలు బలపడి 69.35 వద్ద ముగిసింది. అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతలతో చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. అంతర్జాతీయంగా చూస్తే.. ఆసియా మార్కెట్లు సానుకూలంగా ముగియగా, ఐరోపా షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.