DailyDose

సొంత ఖర్చులతో అమెరికాకు సిఎం-తాజావార్తలు–06/28

Daily Breaking News - Kumaraswamy To USA - June 28 2019

*నా సొంత ఖర్చులతో త్వరలోనే అమెరికా వెళ్తున్నా అంటున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. ఇంత సడెన్‌గా కుమారస్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఓ కారణం ఉంది. ప్రస్తుతం కుమారస్వామి పల్లె నిద్ర పేరిట గ్రామాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం నేటితో ముగింపుకు చేరుకుంది. అయితే సీఎం పల్లె నిద్ర కార్యక్రమం కోసం విపరీతంగా ఖర్చు చేస్తున్నారని.. పల్లెల్లో కూడా ఫైవ్‌స్టార్‌ హోటల్‌ అరెంజ్‌మెంట్స్‌ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
* ఇన్నాళ్లూ మహిళలకు మాత్రమే గర్భ నిరోధక మాత్రలుండేవి. పురుషులైతే కండోమ్‌లు వాడడం ద్వారానో లేక వేసక్టిమీ ద్వారానో పిల్లలు పుట్టకుండా..పునరుత్పత్తికి అడ్డుకట్ట వేసేవారు. ఇప్పుడు పురుషుల కోసం కూడా గర్భ నిరోధక ఔషధం మరో రెండేళ్లలో మార్కెట్లోకి రానుంది. మాంచెస్టర్‌ యూనివర్సిటీ, ఎడిన్‌ బర్గ్‌ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా ఈ గర్భనిరోధక ఔషదాన్ని తయారు చేశారు. ఈ ఔషదాన్ని ఉపయోగించిన తొలి వ్యక్తి, ఎడిన్‌బర్గ్‌ పీహెచ్‌డీ స్టూడెంట్‌ జేమ్స్‌ ఓవెర్స్‌ ఈ ప్రయోగ వివరాలను స్కైడాట్‌కామ్‌తో పంచుకున్నారు. తన సతీమణి ఓ ప్రకటనను చూసి ఈ పరిశోధన గురించి తెలిపిందని, ఈ ప్రయోగంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు.
* జులై 9 వ తేదీన జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయ పరిసరాలను వివిద శాఖల అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ అమ్మవారి కల్యాణానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని అందుకు తగినట్లు అధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులు తోపులాటకు గురికాకుండా బారికేడ్లు ఏర్పాటు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నామన శేషుకుమారి, జీహెఎంసీ అడిషనల్ కమిషనర్ కెనాడీ, ఆలయ ఈవో శర్మ, చైర్మన్ సాయిబాబా, అడిషనల్ డీసీపీ ట్రాఫిక్ భాస్కర్, ఆర్డీవో రాజా గౌడ్, డీఎంసీ గాతారాధిక, వాటర్ వర్క్స్ సీఎంసీ విజయ్ రావ్ తదితరులు పాల్గొన్నారు.
*గుంటూరుసోమవారం నుంచి గుంటూరు ఆఫీస్ నుంచి టిడిపి కార్యకలపాలు.వారంలో ఐదు రోజుల పాటు పార్టీ ఆఫీస్ లో అందుబాటులో ఉండనున్న చంద్రబాబు, లోకేష్,నిత్యం కార్యకర్తలకు అందుబాటులో బాబు తో పాటు ఇత నేతలు.నిత్యం ఏదో ఒక కార్యక్రమం తో ప్రజల లోకి వెళ్లేందుకు ప్రణాళికలు.పార్టీ ఆఫీస్ ను సిద్దం చేసిన సిబ్బంది.
* ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున డీఎస్పీ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. ఎవరూ ఊహించని విధంగా ఏకకాలంలో 37మంది డీఎస్పీలకు స్థాన చలనం కలిగింది. అయితే బదిలీ అయినవారిలో ఏడుగురుని ఇంటెలిజెన్స్‌కు కేటాయించగా, మిగిలిన 30మంది అధికారులు మంగళగిరిలోని హెడ్‌ క్వార్టిర్స్‌లో రిపోర్ట్‌ చేయాలని ఈ మేరకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఎన్నికల నిమిత్తం కొంతమంది పలు జిల్లాలకు బదిలీపై రాగా, గత ప్రభుత్వ హయాంలో కొందరు నేతలు తమకు నచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు చెప్పినట్లు నడుచుకుంటూ అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులను ఇబ్బందులకు గురిచేసిన వారు ఉన్నారు.
* మాజీ ముఖ్యమంత్రి, కుప్పం శాసనసభ్యుడు చంద్రబాబునాయుడు జూలై 2, 3 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్నారు. ఆమేరకు ఆయన పీఏ మనోహర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2వ తేదీ రామకుప్పం, శాంతిపురం మండలాల్లో, 3వ తేదీ గుడుపల్లె, కుప్పం మండలాల్లో ఆయన పర్యటన సాగుతుందని పేర్కొన్నారు. తాను నామినేషన్‌కు రాకపోయినా అభిమానంతో తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు.
*ఏపీఎస్‌ ఆర్టీసీ కార్గో సర్వీస్‌ స్టాక్‌ వెరిఫికేషన్‌ నిమిత్తం ఈ నెల 29, 30 తేదీల్లో బుకింగ్‌, డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్స్‌) కె.వి.ఆర్‌.కె. ప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 29వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పార్శిల్‌ బుకింగ్‌ నిలిపివేయనున్నట్లు తెలిపారు. 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి జూలై 1వ తేదీ ఉదయం 9 గంటల వరకు పార్శిల్‌ డెలివరీ నిలిపివేయనున్నట్లు ఆయన తెలిపారు. కస్టమర్లు ఆర్టీసీ కార్గో సర్వీస్‌ అధికారులు, సిబ్బందికి సహకరించాలని ఈడీ కోరారు.
*పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తరకోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరువలో ఇది కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో రేపటి నుంచి పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. ఈ ఆవర్తనం ఈ నెల 30 నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.మరోవైపు, దేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణ అంచనాలకు భిన్నంగా నిదానంగా సాగుతోంది. వాతావరణ పరిస్థితులు నైరుతి గమనానికి అనుకూలంగా లేవని వాతావరణ నిపుణులు తెలిపారు. రానున్న నాలుగు రోజులూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వెల్లడించారు.
*మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 2, 3 తేదీలలో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2వ తేదీన రామకుప్పం, శాంతిపురం మండలాలలో, కుప్పం, గుడుపల్లె మండలాలలో 3వ తేదీన పర్యటిస్తారన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలందరూ పాల్గొని చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.
*వారాంతాల్లో నచ్చిన చోటికి వెళ్లిపోదాం అనుకుంటున్నారా? కొండల్లో, కోనల్లో ట్రెక్కింగ్‌ చేయాలని ఉందా? మీ అభిరుచికి తగ్గ వారితో విహరించాలని ఉందా? అయితే మీటప్‌ (లీ’’్మ్య్ప) అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. మిలీనియల్స్‌ పర్యాటక వేదికగా పేరున్న మీటప్‌ సేవలు యాప్‌లో పొందవచ్చు. యాప్‌ ద్వారా వారాంతాల్లో ఏఏ విహారాలున్నాయో తెలుసుకోవచ్చు. నచ్చిన ప్రదేశానికి వెళ్లిపోవచ్చు. మీరు కూడా ఈవెంట్‌ నిర్వహించవచ్చు. బృందాన్ని ఏర్పాటు చేయవచ్చు. అంతేకాదు మన పరిసరాల్లో ఉన్న పర్యాటక కేంద్రాల వివరాలు తెలుసుకోవచ్చు. వాటిపై ఇతర సభ్యులు రాసిన రివ్యూలను చదివేయొచ్చు.
*దేశంలో ఏ రేషన్ దుకాణం నుంచైనా సరకులు తీసుకునే వీలుంటే ఎలా ఉంటుంది? ఎంతోమందికి ప్రయోజనం చేకూర్చే ఈ విధానం అమలుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు..’ లక్ష్యం దిశగా చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రామ్విలాస్ పాసవాన్ గురువారం వెల్లడించారు.
*దేశ వ్యాప్తంగా పాత్రికేయులపై జరిగే దాడులను తీవ్రంగా పరిగణిస్తామని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ జస్టిస్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ అన్నారు. దక్షిణ భారత రాష్ట్రాల్లో చోటుచేసుకున్న మీడియా ఉల్లంఘనల కేసులను రెండు రోజులుగా విచారిస్తున్నట్టు తెలిపారు.
*ఒప్పందం ప్రకారం సరైన సమయంలో ఇళ్లు నిర్మించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు వినియోగదారునికి రూ.5 లక్షలు పరిహారం చెల్లించాలంటూ ఈశ్వర కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ యాజమాన్యాన్ని వినియోగదారుల ఫోరం-3 ఆదేశించింది.
*సమాచార హక్కు చట్టం ద్వారా రూ.18.94 లక్షల పంట నష్ట పరిహారం సాధించిన ఘటన ఇది. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్ గ్రామంలో 2012లో మొక్కజొన్న పంట వేసిన రైతులు ఎకరాకు రూ.400 చొప్పున బీమా ప్రీమియం చెల్లించారు. పంటనష్టం వాటిల్లడంతో బీమా డబ్బులు కోసం అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాను సంప్రదించారు.
*కర్ణాటకలోని దొడ్డబళ్లాపురలో పోలీసులకు చిక్కిన బంగ్లాదేశ్ ఉగ్రవాది హబీబుర్ రెహమాన్ (30) రహస్య కార్యకలాపాలను అధికారులు గురువారం వెలుగులోకి తెచ్చారు. అజ్ఞాతవాసం గడుపుతూ, అనేక నేరపూరిత ప్రణాళికల అమలుకు ఉగ్రవాది సిద్ధమైనట్లు గుర్తించారు. ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా హత్యకు కుట్ర పన్నిన విషయం కూడా బయటపడింది.
*దేశవ్యాప్తంగా యూజీసీ, ఏఐసీటీఈ అనుమతులు లేని విద్యాసంస్థలు 380 ఉన్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. రాజ్యసభలో గురువారం ఆయన ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
*పిల్లల్ని బడులకు పంపించే తల్లులకు ఏడాదికి రూ.15వేలు ఇచ్చే అమ్మఒడి పథకాన్ని ఇంటరు విద్యార్థులకూ వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తెల్ల రేషన్కార్డులు కలిగి ఉండి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదివే విద్యార్థులెవరైనా ఈ పథకానికి అర్హులే.
*తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ ఎంఏ ఖాన్ డిమాండ్ చేశారు. గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారని.. ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కో విధంగా చూడడం సరికాదన్నారు. తెలంగాణలో జిల్లాలు పెరిగాయని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
*రానున్న జులై చివరినాటికి బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించుకుంటామని రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు.
* ఆంధ్రప్రదేశ్ సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లు, అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో పనిచేస్తున్న ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాల ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాల సదుపాయాన్ని మరో ఏడాది పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యాలయాల్లో ఉద్యోగులు ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 వరకు విధులు నిర్వర్తించాలని ప్రభుత్వం పేర్కొంది.
*రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థల ప్రతినిధులకు వేతన బకాయిలు త్వరలోనే అందనున్నాయి. ఈమేరకు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచుల వేతన బకాయిల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 84.33 కోట్లను విడుదల చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.