Sports

ఆఖరిలో కాదు ఆరంభంలో కావాలి

VVS Laxman Suggests To Dhoni

ప్రపంచకప్‌లో ధోనీ ప్రదర్శనపై మరోసారి అసంతృప్తి వ్యక్తమయింది. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో చివరిదాకా క్రీజులో నిలిచి ధోనీ(56నాటౌట్‌; 61బంతుల్లో 3×4, 2×6) అర్ధశతకంతో రాణించినా మొదట్లో ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడని మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. 29 ఓవర్‌లో కేదార్‌ జాదవ్‌(7) ఔట్‌ కావడంతో క్రీజులోకి వచ్చిన ధోనీ నిదానంగా ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. కేవలం సింగిల్స్‌కే పరిమితమవడంతో స్ట్రైక్‌ రేట్‌ కూడా 45-50 దాటి ముందుకు సాగలేదు. దీని గురించి లక్ష్మణ్‌ మాట్లాడుతూ..‘ధోనీ ఎప్పటిలాగే ఫినిషింగ్‌లో బ్యాట్‌ ఝళిపించి ఆకట్టుకున్నాడు. అది జట్టుకు బాగా కలిసొచ్చే అంశమే. అయితే ఆరంభం కూడా అదే రీతిలో సాగి ఉంటే బాగుండేది. కానీ అందుకు విరుద్ధంగా నిదానంగా ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లోనూ అతను ఆశించినంత వేగంగా ఆడలేకపోయాడు. స్ట్రైక్‌ రేట్‌ కూడా 50కి మించకపోవడం అసంతృప్తికి గురి చేసింది’ అని పేర్కొన్నాడు. ‘ఏదో ఒక రోజు ఈ విషయంలో ధోనీకి కూడా అలాంటి భావనే కలగవచ్చు. ఇన్నింగ్‌ నిదానంగా ఆరంభిస్తున్నట్లు తాను కూడా చింతిస్తాడు. అంతకుముందు అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ అతను ఇబ్బంది పడ్డాడు. మరోవైపు హార్దిక్‌ పాండ్యలా ఆరంభం నుంచే సానుకూల దృక్పథంతో వేగంగా మహి ఆడలేకపోయాడు’ అని లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. మరోవైపు అభిమానులు కూడా ధోనీ ప్రదర్శనపై అసంతృప్తితో ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు దీనిపై భిన్నరీతుల్లో చమత్కరిస్తున్నారు. మరి కొందరైతే ఏకంగా ధోనీ క్రీజులోకి వస్తే టెస్టు మ్యాచ్‌ చూస్తున్నట్లు ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.