Politics

ప్రియాంకా గాంధీకి యుపీ పోలీసుల కౌంటర్

Uttar Pradesh Police Counters Priyanka Gandhi On Crime Comments

ఉత్తర్‌ ప్రదేశ్‌లో శాంతి భద్రతల అంశంపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలు మాటల యుద్ధానికి దారి తీశాయి. శనివారం ప్రియాంక ట్విటర్ వేదికగా స్పందిస్తూ..‘రాష్ట్రంలో నేరగాళ్లు ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. ఇక్కడి ప్రభుత్వం నేరగాళ్ల ముందు లొంగిపోయిందా అని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అని ఆమె ట్వీట్ చేశారు. ఇక్కడ మహిళల మీద వేధింపులు, అత్యాచారాలు, నేరాలు రోజూ వారీ కార్యక్రమమని కాంగ్రెస్‌ విమర్శించిన సంగతి తెలిసిందే. ప్రజలు ఆటవిక రాజ్యంలో మగ్గిపోతున్నారని మండిపడింది. అయితే ప్రియాంక ట్వీట్‌పై ఆ రాష్ట్ర పోలీసులు వెంటనే స్పందించారు. నేరగాళ్ల మీద తీసుకున్న చర్యలకు సంబంధించిన డేటా ఆధారంగా ఆమెకు సమాధానమిస్తూ ట్వీట్ చేశారు. తీవ్రమైన నేరాలకు సంబంధించి ఈ రెండు సంవత్సరాల్లో 9,225 నేరగాళ్లను అరెస్టు చేశామని, దోపిడీ, హత్యలు, కిడ్నాపులు వంటి నేరాలు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. రాష్ట్రంలో నేరాల రేటు 20-30 శాతం తగ్గిందని, పోలీసుల పహారా, నేరస్థుల పట్ల కఠిన చర్యల ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నామని వెల్లడించారు.