ScienceAndTech

సంషాబాద్ విమానాశ్రయంలో ఫేస్ రికగ్నిషన్‌తో చెకిన్

Shamshabad Airport Adopts Face Recognition Tech For Easy Check-In Process

గ్రీన్ ఎయిర్‌పోర్ట్‌గా, మోడ్రన్ ఎయిర్‌పోర్టుగా ప్రశంసలందుకుంటున్న శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో మరో అధునాతన సాంకేతిక విధానం అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలి సారిగా ప్రయాణికుల ఫేస్ రికగ్నైజేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. తొలి విడతగా దేశీయ ప్రయాణీకులకు ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు.విమాన ప్రయాణంలో జర్నీ కంటే, చెకింగ్‌లకే ఎక్కువ సమయం పడ్తుంది. సాధారణంగా విమానంలో 500 కిలోమీటర్ల దూరం లోని గమ్య స్థానానికి చేరేందుకు 40 నిమిషాల నుంచి గంట సమయం పడుతుంది. అయితే ప్రయాణికులు తనిఖీలు పూర్తి చేసుకోవడానికి ప్రయాణం కంటే ఎక్కువగా కనీసం గంటకు పైగా సమయం పడుతోంది. ప్రయాణికుల విలువైన సమయం వృథా కాకుండా కాపాడడానికి శంషాబాద్‌ రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ అధికారులు ఇటీవల అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. దేశంలోనే తొలిసారిగా ఈ-బోర్డింగ్, ఎక్స్ ప్రెస్ చెకింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు.విమాన ప్రయాణం చేసే వారు ముందు గా ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు తో శంషాబాద్ విమానాశ్రయం లో తమ పేరును నమోదు చేసుకోవాలి. ఫేస్ రికగ్నైజేషన్ సెంటర్ లో ఒక్కసారి తమ పేరు నమోదు చేసుకుంటే చాలు తర్వాత ఎలాంటి ఐడీ కార్డు అవసరం లేకుండానే ఎయిర్ పోర్ట్ లోకి ఎంటర్ కావచ్చు. తొలుత హైదరాబాద్ నుంచి ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు, చెన్నై, వైజాగ్ తో పాటు విజయవాడ వెళ్ళే ప్రయాణీకులకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ-బోర్డింగ్, ఎక్స్ ప్రెస్ చెకింగ్ విధానాన్ని అమలు చేయడానికి విమానాశ్రయం లోని డొమెస్టిక్ డిపార్చర్ గేటు నంబర్లు 1, 3 వద్ద ప్రత్యేకంగా కౌంటర్ల ను ఏర్పాటు చేశారు. ఇది ఈ నెలాఖరు వరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.