Devotional

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం

Puree Jagannath Rathayatra Started On Grand Scale

పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభం – ఆద్యాత్మిక వార్తలు
పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. తొమ్మిది రోజుల పాటు రథయాత్ర వేడుకలు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ వేడుకలో ఎటువంటి ప్రతికూల ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గర్భాలయంలో ఉండే జగన్నాథుడిని, ఆయన సోదరి, సోదరులు సుభద్ర, బలభద్రుల విగ్రహాలను అలంకరించి వాటిని రథాలపై నిలిపి ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. జగన్నాథ ఆలయం మౌసిమా మందిరం వరకు ప్రతి ఏడాది ఈ రథయాత్ర కొనసాగుతుంది. గుండీచ మందిరంలో బసచేసి.. తొమ్మిదో రోజున జగన్నాథుడు, సుభద్ర, జలభద్రుల విగ్రహాలను తిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకొస్తారు.
1. తెలంగాణ భవన్‌లో ఘనంగా బోనాల వేడుకలు
దిల్లీలోని తెలంగాణ భవన్‌లో బోనాల పండగ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటలు, డప్పు కళాకారుల నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోనాల పండగ తెలంగాణకే విశిష్ఠమైన వేడుక అన్నారు. ‘‘ వచ్చే ఏడాది కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బోనాల పండగ నిర్వహించేలా చూస్తాం. అమ్మవారి దయతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలి. దేశ రక్షణ కోసం పని చేస్తున్న సైనికులు మరింత శక్తిమంతం కావాలి’’ అని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో దిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు, రెసిడెంట్‌ కమిషనర్‌ వేదాంతం గిరి, లాల్‌దర్వాజ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
2. శుభమస్తు
తేది : 4, జూలై 2019
సంవత్సరం : వికారినామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
పక్షం : శుక్లపక్షం
తిథి : విదియ
(నిన్న రాత్రి 10 గం॥ 3 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 7 గం॥ 9 ని॥ వరకు)
నక్షత్రం : పుష్యమి
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 40 ని॥ నుంచి
మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 30 ని॥ వరకు)
యోగము : వ్యాఘాతము
కరణం : బాలవ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 11 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 23 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 8 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 7 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 10 గం॥ 8 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 0 ని॥ వరకు)(ఈరోజు సాయంత్రం 3 గం॥ 23 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 15 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 36 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 2 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 40 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 12 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 57 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 46 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : మిథునము
చంద్రరాశి : కర్కాటకము
3.దిల్లీలో ఘనంగా బోనాల ఊరేగింపు
డప్పు చప్పుళ్లు.. ఒగ్గు కళాకారుల నృత్యాల నడుమ దేశ రాజధాని దిల్లీలోని ఇండియా గేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ భవన్ వరకు బుధవారం బోనాల ఊరేగింపు ఘనంగా జరిగింది. అనంతరం తెలంగాణ భవన్లో ఘట స్థాపన చేశారు. ఊరేగింపులో తెరాస లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు తేజావత్ పాల్గొన్నారు.
4.నేడు జగన్నాథ రథయాత్ర
శ్వప్రసిద్ధ పూరీ రథయాత్రకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. అస్వస్థతకు గురైన జగన్నాథుడు కొద్దిరోజులుగా చీకటిగదిలో చికిత్స పొంది.. కోలుకున్నట్లు భక్తులు భావిస్తారు. ఆ చీకటి గది నుంచి నేడు (గురువారం) జగన్నాథస్వామి బయటకు వచ్చి, సోదర, సోదరి (బలభద్ర, సుభద్ర)లతో కలసి నవదిన యాత్రగా పెంచిన తల్లి (గుండిచా దేవి) మందిరానికి బయలుదేరతారని భక్తుల విశ్వాసం. ముగ్గురు మూర్తులు అధిరోహించి వెళ్లే నందిఘోష్, తాళధ్వజ్, దర్పదళన్ రథాలు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. రథయాత్రలో పది లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. బుధవారం నుంచే పూరీకి భక్తులు పోటెత్తారు. భద్రతాపరంగా పోలీసు యంత్రాంగం 154 ప్లాటూన్ల బలగాలతో గట్టి బందోబస్తు చేసింది. రద్దీ నియంత్రణకు తొలిసారిగా హైదరాబాద్కు చెందిన ఎన్ఎస్జీ కమాండోలు నియమితులయ్యారు. బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఓఎస్ఏపీ, ఎస్ఓజీ జవానులు సమస్యాత్మక ప్రాంతాల్లో పరిస్థితి సమీక్షించనున్నారు. గురువారం ఉదయం 9.30 నుంచి రథాలను లాగేలా యంత్రాంగం అన్ని విధాలా ఏర్పాట్లు చేసింది.
5.యాదాద్రిలో వరుణ యాగానికి ఏర్పాట్లు
యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయ నిర్వహణలో వరుణ యాగం ఈ నెల ఐదు నుంచి మూడు రోజులపాటు జరగనుంది. దీని నిర్వహణకు సంప్రదాయ వనరులు సమకూరుస్తున్నట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. రుత్వికులతో పారాయణం, యాజ్ఞికులతో యాగం జరిగేలా రామలింగేశ్వర ఆలయ పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు.
6. అహ్మదాబాద్లో ప్రారంభమైన రథయాత్ర
జగన్నాథుడి వార్షిక రథయాత్ర గురువారం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆయన భార్య సోనాల్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళహారతి కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఈ రథయాత్ర శ్రీ గుండీచా ఆలయం వద్ద పరిసమాప్తం కానుంది. 2.5కి.మీ వరకు జరిగే ఈ యాత్రలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రథాన్ని లాగుతారు. గుండీచా ఆలయానికి చేరుకున్న దేవతా మూర్తుల విగ్రహాలు..యాత్ర పూర్తయిన తర్వాత తిరిగి జగన్నాథుడి ఆలయానికి చేరుకుంటాయి. బహుడ యాత్ర పేరిట ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తారు.అహ్మదాబాద్లో ఏడాదికోసారి జరిగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసింది. కానీ యాత్రికులకు వసతి విషయంలో ప్రతిసారి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది. మే మొదటి వారంలో గుజరాత్ను ‘ఫణి’ తుపాను అతలాకుతలం చేసిన నేపథ్యంలో ప్రయాణికులకు ఏర్పాట్లు కాస్త కష్టమయ్యాయి. ఉగ్రముప్పు హెచ్చరికలు రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ యాత్రకు సుమారు 2లక్షల మంది వస్తారని అంచనా. ఈ యాత్రకోసం 10 వేల మందితో భద్రతా చర్యలు చేపట్టారు. మరోవైపు ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్రకు కూడా సర్వం సిద్ధమైంది. పూరీ తీరంలో భక్త కెరటాలు పోటెత్తుతున్నాయి. మరికాసేపట్లో యాత్ర ప్రారంభం కానుంది.
7. చరిత్రలో ఈ రోజు/జూలై 4*అమెరికా స్వాతంత్ర్య దినోత్సవంటైక్వాండో దినోత్సవం.
1897: భారత స్వాతంత్ర్యసమరయోధుడు అల్లూరి సీతారామరాజు జననం (మ.1923).
1898: రెండుసార్లు భారతదేశ ఆపద్ధర్మ ప్రధానిగా పనిచేసిన గుర్జారీలాల్ నందా జననం (మ.1998).
1902: ప్రసిద్ధి గాంచిన భారతీయ తత్వవేత్త స్వామి వివేకానంద మరణం (జ.1863).
1933: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15 వ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జననం.
1946: తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య మరణం. (జ.1927)
1963: భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మరణం (జ.1878).
1970: నక్సల్బరీ, శ్రీకాకుళము లలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటాల స్ఫూర్తితో విరసం (విప్లవ రచయిత సంఘం) ఏర్పడింది.
1871: వాక్యూమ్ క్లీనర్ సృష్టికర్త హుబెర్ట్ సెసిల్ బూత్ జననం ( మ.1955
8. గోల్కొండలో ప్రారంభమైన బోనాల జాతర
తెలంగాణ వ్యాప్తంగా బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి భక్తులు తొలి బోనం సమర్పించారు. ఇవాళ టోలీచౌకీ నుంచి ఫలహార ర్యాలీ ప్రారంభమైంది. మార్గమధ్యంలోని పూజారి ఇంటి వద్ద అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఘటాలను ఊరేగింపుగా తీసుకొచ్చి కొండపై ఉన్న అమ్మవారికి సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు ఈ బోనాల ఉత్సవాలను నిర్వహించనున్నారు. సాధారణంగా తెలంగాణలో ఆషాఢం, శ్రావణ మాసాల్లో బోనాల జాతర జరుపుతారు. జంటనగరాల్లో మాత్రం ఆషాఢమాసంలోనే అంగరంగవైభవంగా బోనాల జాతర నిర్వహిస్తారు.
9. కోల్‌కతాలో రథయాత్ర ప్రారంభించిన సీఎం మమతా బెనర్జీ
శ్రీ జగన్నాథస్వామి రథయాత్రను కోల్‌కతాలో నేడు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ పాల్గొని జెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. అశేష భక్తజనం హాజరవ్వగా ప్రత్యేక పూజల అనంతరం రథయాత్ర ప్రారంభమైంది. జగన్నాథ రథయాత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, సుఖశాంతులను ప్రసాదించాలని జగన్నాథుడిని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని పేర్కొన్నారు.
10. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు
తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఎర్రబెల్లి కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వాదం చేయగా…. ఆలయ అధికారులు ఎర్రబెల్లి దయాకరరావును పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఎర్రబెల్లి తెలంగాణ వనరులను ఏపీ, ఏపీ వనరులను తెలంగాణ ప్రజలు ఉపయోగించుకొని అభివృద్ధి అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని అన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు సుపరిపాలన అందిస్తున్నారని… కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి, రెండు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి సాధించాలని తెలిపారు.
11. టీటీడీ జేఈవోగా భాద్యతలు చేపట్టిన: బసంత్ కుమార్ …
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన జేఈవోగా బసంత్ కుమార్ భాధ్యతలు స్వీకరించారు. శ్రీవారి ఆలయంలోని గరుడళ్వార్ సన్నాధిలో టీటీడీ జేఈవోగా ప్రమాణ స్వీకారం చేసారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా ఆలయ అధికారులు మర్యాద పూర్వకంగా పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు. అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ…నా మొదటి ప్రాధాన్యత భక్తులు సౌకర్యాలను మెరుగు పరచడంమని, రెండోవ ప్రాధ్యనత అవినితి రహిత పాలన అందించడంమని, మూడోవ ప్రాధ్యనత స్వామి సన్నిధిలో సేవ చెయ్యడం ద్వారా నా జన్మను సార్దకం చేసుకోవడంమని జేఈవో బసంత్ కుమార్ స్పష్టం చేసారు. అవినితి ఆరోపణలు పై విచారణ జరుపుతామని పేర్కొన్నారు.