Food

మాంసం బదులు కూరగాయలు తీసుకోండి

Eat lot of veggies instead of meat and carbohydrates

బరువు తగ్గాలన్నా, పోషకపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలన్నా డాక్టర్లు కానీ, న్యూట్రిషనిస్టులు కానీ మొదటగా చెప్పే విషయం అన్నం మానెయ్యమని.. అందుకే ఇప్పుడు చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్లకున్నా, డైటీషియన్లతో మాట్లాడకున్నా తమకు తాముగానే అన్నాన్ని మానేసి ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నారు. కానీ డాక్టర్లు అన్నం మానెయ్యమని ఎందుకు చెప్పారు? అని ఎవ్వరూ ఆలోచించరు. కారణం పిండిపదార్థాలు.ఆహారంలో తక్కువ పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల ఆయుర్దాయం నాలుగేళ్లకు పైగా తగ్గిపోతుందని ఒక అధ్యయనం వెల్లడించింది. బరువు తగ్గడానికి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారంగా మాంసం, చేపలు, కూరగాయలు, గింజధాన్యాలు వంటి వాటిని చాలామంది తింటున్నారు. ఇవి ఆరోగ్యం అందిస్తాయని భావిస్తున్నారు. కానీ అమెరికాలో 25 ఏళ్లకు పైగా జరిపిన ఒక అధ్యయనం మాత్రం ఆహారంలో పిండిపదార్థాలు తీసుకోవడం మోస్తరుగా తగ్గించి, మాంసం తినడానికి బదులు కూరగాయలు, గింజధాన్యాలు తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతోంది. తాము రోజూ ఎంత కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నామో గుర్తుపెట్టుకుని చెప్పిన వారి ఆధారంగా ఈ అధ్యయనం నిర్వహించారు.
**ప్రపంచవ్యాప్తంగా..
అమెరికా పరిశోధకులు తమ అధ్యయనం వివరాలను ‘ది లానె్సట్ పబ్లిక్ హెల్త్’ మేగజైన్లో ప్రచురించారు. దీని ప్రకారం అమెరికాలో ఉన్న 15,400 మందిని వివిధ ఆహారపు అలవాట్లపై ప్రశ్నించారు. వారు ఏమేం తింటారు, ఏం తాగుతారు, వాటి పరిమాణం వివరాలతో ప్రశ్నలు నమోదు చేయించారు. ఈ గణాంకాల ఆధారంగా వారు తమ ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రొటీన్స్ నుంచి ఎంత కేలరీలు పొందుతున్నారో అంచనా వేశారు. సగటున 25 ఏళ్ల వయసు వారు ఇచ్చిన వివరాలు పరిశీలించిన శాస్తవ్రేత్తలు, ఆహారంలో మోస్తరుగా కార్బొహైడ్రేట్స్ తీసుకుంటున్నవారు వాటిద్వారా 50 నుంచి 55 శాతం శక్తిని పొందుతున్నట్టు గుర్తించారు. కార్బొహైడ్రేట్లు మరీ తక్కువగా, అతిగా తినేవారితో పోలిస్తే వీరిలో మరణ అవకాశాలు తక్కువని గుర్తించారు. కూరగాయలు, పండ్లు, చక్కెరతో పాటు వారు తీసుకున్న పిండిపదార్థాల్లో ఆలుగడ్డలు, బ్రెడ్, అన్నం, పాస్తా, గింజ ధాన్యాలు కూడా ఉన్నాయి. ఆహారంలో మోస్తరుగా కార్బొహైడ్రేట్స్ తీసుకున్నవారు 50 ఏళ్ల వయసులో ఉంటే, వారికి మరో 33 ఏళ్లపాటు జీవించే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. ఈ అధ్యయనం ప్రకారం..
పిండిపదార్థాలు మోస్తరుగా తీసుకునేవారు కార్బొహైడ్రేట్స్ నుంచి 30 లేదా అంతకంటే తక్కువ శాతం శక్తి పొందేవారి కంటే నాలుగు సంవత్సరాలు ఎక్కువగా జీవిస్తారు. కార్బొహైడ్రేట్స్ ద్వారా 30 నుంచి 40 శాతం శక్తి పొందేవారి కంటే మోస్తరుగా వాటిని తీసుకునేవారు 2.3 ఏళ్లు ఎక్కువ జీవిస్తారు. పిండిపదార్థాల నుంచి 65 శాతం శక్తిని పొందేవారి కంటే, వాటిని మోస్తరుగా తీసుకునేవారు 1.1 ఏడాది ఎక్కువ జీవిస్తారు. పరిశోధకులు తాము గుర్తించిన ఫలితాలను అంతకు ముందు 20 దేశాల్లో 4 లక్షల మందిపై చేసిన పరిశోధనలతో పోల్చి చూశారు. అవి ఒకేలా ఉన్నాయని చెబుతున్నారు. శాస్తవ్రేత్తలు ఈ అధ్యయనంలో భాగంగా తక్కువ కార్బొహైడ్రేట్లు (లో కార్బ్) ఉండే జంతుమాంసం, ఫ్యాట్ మొక్కల ఆధారిత ప్రొటీన్లు, ఫ్యాట్స్ పోల్చి చూశారు. లో- కార్బ్ డైట్లో భాగంగా పశుమాంసం, చికెన్, చీజ్ వంటివి తింటే మరణ అవకాశాలు స్వల్పంగా పెరగడానికి కారణం అవుతుందని పరిశోధకులు గుర్తించారు. కానీ చిక్కుళ్లు, గింజలు వంటి మొక్కల ఆధారిత ప్రొటీన్లు, ఫ్యాట్స్ తినడం వల్ల డెత్ రిస్క్ స్వల్పంగా తగ్గుతుందని చెబుతున్నారు.
***పోషకాలు..
బరువు తగ్గడానికి అందరూ మాంసకృత్తులు, కొవ్వులు వంటి లో-కార్బ్ ఆహారం తీసుకుంటున్నారు. అయితే బ్రిగ్హామ్ ఉమెన్ హాస్పిటల్ గణాంకాల ప్రకారం ఉత్తర అమెరికా, యూరప్ అంతా లో-కార్బ్ డైట్ కోసం జంతుమాంసం తింటున్నారు. ఇది వారి జీవితకాలాన్ని తగ్గించవచ్చు. జంతుమాంసం బదులు లో-కార్బ్ డైట్ కోసం చిక్కుళ్లు, గింజలు వంటి మొక్కల ఆధారిత ప్రొటీన్లు, ఫ్యాట్స్ తీసుకుంటే దానివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. వెస్టర్న్ ఆహారశైలి వల్ల కూరగాయలు, పండ్లు, ధాన్యాలు వంటి పిండిపదార్థాలు తీసుకోవడం తగ్గిపోతుందని అధ్యయనంలో శాస్తవ్రేత్తలు గుర్తించారు. వాటికి బదులు జంతు మాంసం, కొవ్వులు ఎక్కువ తింటున్నారని అంచనా వేశారు. ఇది వృద్ధాప్యం, శరీరంలో మార్పులకు కారణం అవుతుందన్నారు. ఈ అధ్యయనం వల్ల ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. ఎవరూ పోషకాలపై తగినంత దృష్టి పెట్టడం లేదు. కానీ అవి పశుమాంసం, మొక్కల నుంచి పొందుతున్నారా? అన్న విషయంపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఆహారంలో కార్బొహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గించినప్పుడు వాటి మొక్కల ఆధారిత కొవ్వులు, మాంసకృత్తుల నుంచి భర్తీ చేయాలి. అలాకాకుండా వాటిని జంతు మాంసం నుంచి స్వీకరించకూడదు.
పరిమితులు
* కొన్ని సమూహాల వారిని పరిశీలించకుండా కేవలం వ్యక్తులు స్వయంగా సమర్పించిన డేటా ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. ఇందులో కచ్చితత్వం లేకపోవచ్చు.
* పరిశోధకులు అధ్యయనంలో డైట్ ప్రారంభించినప్పుడు, ఆరేళ్ల తర్వాత మాత్రమే వారి వివరాలు నమోదు చేశారు. ఆ లోపు ఆహార నమూనాలలో మార్పులు వచ్చి ఉండొచ్చు.
* ఈ అధ్యయనంలో ఉపయోగించిన ప్రశ్నావళిలో జనం తీసుకునే కేలరీలు, ఫ్యాట్స్ తక్కువ అంచనా వేశారని మరో ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు. అమెరికా శాస్తవ్రేత్తలు చేసిన ఈ అధ్యయనంలో ఎక్కువ మాంసం, తక్కువ పిండి పదార్థాలు, లేదా ఎక్కువ పిండిపదార్థాలు, తక్కువ కొవ్వులు తినే రెండు గ్రూపుల్లో అధిక బరువు, ఊబకాయం వల్ల మరణ అవకాశాలు ఉంటాయని ఈ అధ్యయనం వివరించింది.