Health

భారతదేశంలో భారీగా ఊబకాయం

Obesity On The Rise In India

భారత్‌లో అధిక బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2012లో 2.41 కోట్లుగా ఉన్న స్థూలకాయుల సంఖ్య (18 ఏండ్లు పైబడిన వారు), 2016 నాటికి 3.28 కోట్లకు చేరుతుందని పేర్కొంది. అదే అధిక బరువు ఉన్న ఐదేండ్లలోపు చిన్నారుల సంఖ్య 2018లో 29 లక్షలుగా ఉన్నట్లు తెలిపింది. అయితే పోషకాహార లోపం ఉన్న వారి సంఖ్య మాత్రం తగ్గుతున్నదని నివేదిక తెలిపింది. 2004-06 మధ్య కాలంలో దేశంలో పోషకాహార లోపం ఉన్న వారి సంఖ్య 25.39 కోట్లు (మొత్తం జనాభాలో 22.2 శాతం) ఉండగా, 2016-18 నాటికి ఆ సంఖ్య 19.44 కోట్లకు (14.5 శాతానికి) తగ్గినట్లు వివరించింది. స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్-2019 పేరిట ఐక్యరాజ్యసమితి ఈ నివేదికను విడుదల చేసింది. 2018 నాటికి ప్రపంచవ్యాప్తంగా 82 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. అంతకుముందు ఏడాది కంటే ఈ సంఖ్య 9 కోట్లు అధికం. వరుసగా మూడో ఏడాది కూడా ఈ సంఖ్య పెరుగడం గమనార్హం. 2030 నాటికి ఆకలితో అలమటించేవారే లేకుండా చేయాలన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాన్ని సాధించడం పెను సవాలేనని ఇది తెలియజేస్తున్నది.