కావలసినవి
సెనగపప్పు: ఒకటిన్నర కప్పులు, బెల్లం: 2 కప్పులు, తాజాకొబ్బరి తురుము: 5 టేబుల్స్పూన్లు, యాలకులపొడి: అరటీస్పూను పైపూతకోసం: బియ్యప్పిండి: 3 కప్పులు, మంచినీళ్లు: తగినన్ని, నెయ్యి: 2 టీస్పూన్లు, ఉప్పు: చిటికెడు
తయారుచేసే విధానం
ప్రెషర్కుక్కర్లో సెనగపప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి. తరవాత నీళ్లు వంపేసి గ్రైండర్లో మెత్తగా చేసి పక్కన ఉంచాలి. నాన్స్టిక్ పాన్లో బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి కరిగించి, మరిగించాలి. తరవాత మెత్తగా మెదిపిన సెనగపప్పు, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి కలుపుతూ దగ్గరగా అయ్యేవరకూ ఉడికించాలి. ఇప్పుడు ముద్దని గుండ్రని ఉండల్లా చేసి పక్కన ఉంచాలి. బాణలిలో ఉప్పు, సుమారు 3 కప్పుల నీళ్లు, నెయ్యి వేసి మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.ఓ గిన్నెలో బియ్యప్పిండి వేసి ఈ మరిగించిన నీళ్లను కొంచెంకొంచెంగా పోస్తూ కలపాలి. చల్లారాక పిండి ముద్దను చిన్న ఉండల్లా చేయాలి. ఒక్కో ఉండనీ చిన్నపాటి పూరీలా అరచేతిలో వత్తి, అందులో పూర్ణం ఉండని పెట్టి, మూసేసి నెయ్యి రాసుకుంటూ నున్నని ఉండలా చుట్టాలి. ఇలాగే అన్నీ చేసుకుని నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేటుల్లో పెట్టి సుమారు పన్నెండునిమిషాలు ఉడికించాలి. చల్లారాక తీస్తే పూర్ణం కుడుములు రెడీ.