Sports

శుక్రవారం తెలుస్తుంది

New Coach Of Team India Will Be Announced On Friday

16న టీమిండియా కోచ్‌ ప్రకటన
టీమిండియా ప్రధాన కోచ్‌ ఎంపిక ఫలితాలను బీసీసీఐ శుక్రవారమే ప్రకటించనుందని తెలుస్తోంది. కపిల్‌ నేతృత్వంలోని కమిటీ కోచ్‌ పదవి కోసం శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. కపిల్‌దేవ్‌, అన్షుమన్ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ భారత ప్రధాన కోచ్ ఎంపికను చేపట్టింది. ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లను మాత్రమే కపిల్‌ కమిటీ ఇంటర్వ్యూలకు పిలవనుంది. అయితే అదే రోజు కోచ్‌ ఫలితాలు కూడా ప్రకటిస్తారని సమాచారం. ముంబయిలో ప్రధాన కార్యాలయంలో ఈ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ముంబయికి రాలేని వాళ్లు స్కైప్‌ ద్వారా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. ప్రధాన కోచ్‌ సహా అన్ని పదవులకూ కలిపి బీసీసీఐకి దాదాపు 2 వేల దరఖాస్తులు వచ్చాయి. భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, అన్షుమన్‌ గైక్వాడ్‌ బహిరంగంగానే రవిశాస్త్రికి మద్దతు పలకడంతో ప్రస్తుత కోచ్‌నే మళ్లీ ఎంపిక చేస్తారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. అయితే కోచ్‌ ఎంపికలో కోహ్లి అభిప్రాయాల్ని కమిటీ పరిగణనలోకి తీసుకోదని, స్వతంత్రంగా వ్యవహరిస్తుందని బీసీసీఐ స్పష్టం చేసింది. టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌ల నుంచి రవిశాస్త్రికి గట్టి పోటీ ఎదురు కావచ్చని తెలుస్తోంది.