Editorials

కృష్ణాజిల్లాలో ఏడాది పాటు సాగిన స్వాతంత్రోద్యమం

కృష్ణాజిల్లాలో ఏడాది పాటు సాగిన స్వాతంత్రోద్యమం-Krishna District Tiruvuru Mandal Ganugapadu Freedom Fight Story

*** కృష్ణాజిల్లాలో ఏడాది పాటు సాగిన గానుగపాడు రిపబ్లిక్ ఉజ్వల గాధ
*** పోరాట సమయంలో తీసిన చిత్రం. మధ్య వరుసలో ఎడమ నుండి కుడికి మొదటి వ్యక్తి జలగం వెంగళరావు.

“బయట నుండి వచ్చే కష్ట నష్టాలను మతాల భేదభావం లేకుండా కలిసికట్టుగా ఎదుర్కొందాం” – ఇదే భారతదేశం రిపబ్లిక్‌గా అవతరించకముందు గానుగపాడులో ఏర్పడిన తిరుగుబాటు ప్రభుత్వం తమ పాలనలోని సభ్యులనుండి స్వీకరించిన ప్రమాణ పత్రంలోని ఓ కట్టుబాటు. భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన అనంతరం ప్రస్తుతం కృష్ణాజిల్లా తిరువూరు మండలంలోని గానుగపాడు దాని శివారు ఆరు గ్రామాలు నిజాం ప్రభుత్వ పాలనలో ఉండేవి. నిజాం నవాబు తన ప్రభుత్వాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానికి నిరాకరించడంలో ఈ ఆరు గ్రామాల ప్రజల్లో చైతన్యం పెల్లుబికి నిజాం నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పాలని స్వంత విధానాలు, ఆదాయ వనరులతో స్వతంత్ర రిపబ్లిక్‌గా ప్రకటించుకున్నారు. తమ ప్రాంతాన్ని తామే పరిపాలించుకోవటం కోసం ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గానుగపాడు కేంద్రంగా ఆరు గ్రామాలు రిపబ్లిక్‌గా ఏర్పడటానికి దారి తీసిన పరిస్ధితులు, ఆ తర్వాత అది భారత దేశంలో విలీనం అయ్యే వరకు జరిగిన సంఘటనలు ఈ విధంగా ఉన్నాయి. గానుగపాడు, పల్లెర్లమూడి, చౌటపల్లి, టేకులపల్లి, కొత్తూరు, చిక్కుళ్లగూడెం గ్రామాలు నిజాం ప్రభుత్వ పాలనలో ఉండేవి. గానుగపాడు గ్రామంలో ఒక జమేదారు, ఐదుగురు పోలీసులతో ఒక నాకా (పోలీస్ స్టేషన్)ను నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనితో ప్రజలు జాతీయ జెండా ఎగురవేసి “నిజాం గో బ్యాక్”, “ఇండియన్ యూనియన్ జిందాబాద్” అనే నినాదాలతో ఊరేగింపు జరిపారు. ఇదంతా చూసిన నిజాం ప్రభుత్వ ఉద్యోగులకు మింగుడుపడక ఈ ఆరు గ్రామాల ప్రజలను నిర్దాక్షిణ్యంగా అణిచివేయటానికి ప్రయత్నించారు. వీరి దౌర్జన్యాలను సహించలేని ప్రజలు దెబ్బకు దెబ్బ తీయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆయుధ శిక్షణా శిబిరాలు రహస్యంగా పని చేయటం ఆరంభించాయి. ఆయుధాలు తయారు చేయడంలో నిష్ణాతులైన తిరువూరుకి చెందిన గుండిమెడ లక్ష్మీనారాయణ (బుల్లోడు), పసుపులేటి వీరయ్యల ఆధ్వర్యంలో పల్లెర్లమూడి గ్రామంలో పోరాటానికి కావల్సిన ఆయుధ సామాగ్రి తయారు చేయడం ప్రారంభించారు. వీరికి సహకరించటానికి సికింద్రాబాద్ నుండి నరసింహసింగ్ అనే అనుభవం కలిగిన ఆయుధాల తయారీదారుడిని పిలిపించారు. పల్లెర్లమూడి గ్రామంలో బ్రహ్మం అనే వ్యక్తి ఇంట్లో ఆయుధ సామాగ్రి తయారీ కర్మాగారాన్ని నెలకొల్పారు. అనంతరం గానుగపాడు గ్రామంలో ఉన్న నాకాపై తిరుగుబాటు జరపడంతో దానిలోని జమేదారు, ఇతర పోలీసులు పలాయనం చిత్తగించారు. నాకాలో ఉన్న ఆయుధ సామాగ్రి, రైతుల భూములకు సంబంధించిన పత్రాలు, ఇతర రికార్డులు, కొంత నగదు పోరాట కమిటీ సభ్యులు స్వాధీనపరుచుకున్నారు. ఈ ప్రభుత్వం రూపొందటానికి సహకరించిన ప్రముఖుల్లో గానుగపాడుకు చెందిన కర్నాట వెంకటరెడ్డి, పాట్రేడు సుబ్బారెడ్డి, గ్రామాధికారుల్ కుటుంబానికి చెందిన కవుటూరు సత్యనారాయణ, సెట్టిపల్లి వెంకటప్పారెడ్డి, శీలం వెంకటరెడ్డి, చిక్కుళ్లగూడెం గ్రామానికి చెందిన టంటు బాలయ్య, పల్నాటి వీరయ్య, కొత్తూరుకు చెందిన గురాల అనిమిరెడ్డి, తోకచిచ్చు పుల్లంరాజు, పల్లెర్లమూడికి చెందిన చీరెడ్డి పెదబసవరెడ్డి, పొట్లిరెడ్డి, చారుగుళ్ల అప్పయ్య, చౌటపల్లి గ్రామానికి చెందిన ఎరుము నాగిరెడ్డి, గుర్రాల చిన కోటిరెడ్డి, కామిరెడ్డి వెంకటరెడ్డి, గొల్లమందల అప్పయ్య, టేకులపల్లి గ్రామానికి చెందిన కామిరెడ్డి రామిరెడ్డి, శీలం అచ్చిరెడ్డి, మంగినపూడి బిచ్చం, పోలిశెట్టిపాడు గ్రామానికి చెందిన కోటేరు రామచంద్రరెడ్డి తదితరులు ఉన్నారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకులు టి.హయగ్రీవాచారి, జలగం వెంగళరావు, బొమ్మకంటి సత్యనారాయణరావులు గానుగపాడు రిపబ్లిక్ ప్రభుత్వానికి ప్రధాన సలహాదారులుగా ఉండేవారు. ఈ ప్రభుత్వం 1947 నవంబరు నెల నుండి ప్రజాస్వామిక రాజ్యంగా పాలించడం మొదలుపెట్టింది. రేడియోలోనూ విశేషంగా ప్రచారం లభించింది. గానుగపాడు తిరుగుబాటును విన్న అప్పటి కేంద్ర హోం శాఖా మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ ఆ ప్రాంత ప్రజల జాతీయ భావాలను ప్రశంసించి నిజాం నవాబు నుండి ఏ ఆపద రాకుండా గానుగపాడు ప్రాంతాన్ని కాపాడతామని హామీ ఇచ్చి భారత దేశంలో విలీనం చేయటానికి చర్యలు తీసుకుంటామని స్ధానిక కాంగ్రెస్ నాయకులకు వాగ్ధానం చేశారు. గానుగపాడు రిపబ్లిక్‌లో ముఖ్యమంత్రి, మంత్రులు దాదాపు సంవత్సరం పాటు చక్కని పరిపాలన అనుభవించినట్లు ప్రజలు చెప్తూ ఉంటారు. వెట్టి చాకిరి నిర్మూలించారు. అప్పట్లో కిరోసిన్ దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతుండగా, కిరోసిన్, ఇతర నిత్యావసర వస్తువులను సక్రమంగా పంపిణీ చేయించారు. శాంతి భద్రతలు చక్కగా కాపాడారు. మధ్యనిషేధాన్ని కఠినంగా అమలుపరిచారు. పాఠశాలలు నడిపి జాతీయ భావాలు పెంపొందించారు. రైతుల సంక్షేమానికి చెరువులు, కాలువలు తవ్వకం పనులను ప్రజల సాయంతో స్వచ్ఛందంగా చేపట్టారు. జాతీయ నాయకులు జయప్రకాష్ నారాయణ్, టంగుటూరి ప్రకాశం, ఆచార్య రంగా తదితరులు ఈ ఉద్యమ కాలంలో వచ్చి వీరిని ప్రోత్సహించారు. కులమత బేధాలు లేకుండా పరిపాలన చక్కగా సాగింది. హైదరాబాద్ సంస్ధానంలో పరిస్ధితులు తారుమారు కావడం, ఆ సంస్ధానంపై 1948 సెప్టెంబరు 13వ తేదీన సైనిక చర్య జరిగి 17వ తేదీన అది ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడం అందరికీ తెలిసిందే. అనంతరం గానుగపాడు రిపబ్లిక్ ప్రత్యేక ప్రభుత్వం రద్దయింది. అందరితో పాటు 1950 జనవరి 26వ తేదీన ఆ ప్రాంత ప్రజలు రిపబ్లిక్ దినోత్సవం జరుపుకున్నారు. ఆనాడు గానుగపాడు రిపబ్లిక్ కమిటీలో పాలుపంచుకున్న యోధులు నేటికీ ఈ ప్రాంతంలో ఉన్నారు.