ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి పరిపాలన చాలా బాగుందని టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు.
నవరత్నాలు పథకానికి నిధుల కొరత ఉందని.. అయితే కేంద్రం మాత్రం రాష్ట్రానికి సహకరించడం లేదని ఆయన చెప్పుకొచ్చారు.
తాను ఏ పార్టీలో చేరాలనే అశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని రాయపాటి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నూతన టెండర్లు పిలవడం వల్ల వ్యయం పెరుగుతుందని ఆయన తెలిపారు.
శుక్రవారం నాడు తిరుమల వెంకన్నను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రాయపాటి పై వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే.. రాయపాటి టీడీపీకి టాటా చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
గత నెలలో కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడు పార్టీ మార్పుపై రాయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో టీడీపీలో చర్చనీయాంశమయ్యాయి.
అయితే తాజా వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో..? రాయపాటి ఏ పార్టీ కండువా కప్పుకుంటారో..? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే మరి.