DailyDose

ఆర్టీసీలో 1000 విద్యుత్ బస్సులు-తాజావార్తలు–08/31

ఆర్టీసీలో 1000 విద్యుత్ బస్సులు-తాజావార్తలు–08/31

*అతి త్వరలో రాష్ట్రంలో రోడ్లపై విద్యుత్‌ బస్సులు పరుగులు తీయనున్నాయి. ఈ బస్సులతో గాలి, ధ్వని కాలుష్యం తగ్గనుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఏపీకి 300 విద్యుత్‌ బస్సులను కేటాయించింది. డీజిల్‌ ధరల పెరుగుదలతో ఆర్టీసీ ఏటా రూ.300 కోట్ల వరకు నష్టాల్ని చవిచూస్తోంది. దీంతో ఇప్పటివరకు డీజిల్, సీఎన్‌జీ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ నిర్వహణ వ్యయం తగ్గించేందుకు విద్యుత్‌ బస్సులను నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలే విద్యుత్‌ బస్సుల నిర్వహణపైన నిపుణుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. డీజిల్‌ బస్సులు నడపడం వల్ల కిలోమీటరుకు డ్రైవర్‌ జీతభత్యంతో కలిపి రూ.38 వరకు ఖర్చవుతుంది.
*కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లిలో యురేనియం కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ వ్యర్ధాలపై ప్రభుత్వం తనిఖీకి ఆదేశించింది. యురేనియం కార్పొరేషన్ వలన భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్న ఆరోపణలు వెల్లుత్తడంతో ప్రభుత్వం తనిఖీ, అధ్యయనానికి ఆదేశించింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి దీనిపై ప్రభుత్వ నిపుణుల కమిటీని నియమించింది.
*ముఖ్యమంత్రి గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం కార్వేటినగరం మాజీ ఎంపీపీ, టీడీపీ నేత జనార్థన్‌ రాజును పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్‌ చేశారు. ఈ నెల 26 న తలకోన లో సిఎం జగన్‌, ఎంపి విజయసాయిరెడ్డి పై జనార్థన్‌ రాజు, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో శుక్రవారం రాత్రి జనార్థన్‌ రాజు ను కార్వేటినగరం సీఐ సురేందర్‌ రెడ్డి అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ను నిరసిస్తూ.. స్థానిక తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు.
*రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో శనివారం ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి సిఎం జగన్‌ మొక్కలు నాటారు. అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను ప్రారంభించారు.
*విజయవాడ పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ ఎదుట ఉన్న ప్రగతి పార్కుకు డాక్టర్‌ వైఎస్సార్‌ పార్కుగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
*ఆంధ్రప్రదేశ్ వైద్య మండలి చైర్మన్ గా నకరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ బూచిపూడి సాంబశివారెడ్డి ఎన్నికయ్యారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పడిన వైద్య మండలి రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా ఏర్పడిన కౌన్సిల్లో ఆరుగురు వైద్యులు నలుగురు మెడికల్ అధికారులకు స్థానంకల్పించి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని సమక్షంలో లో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి సచివాలయంలో శుక్రవారం చైర్మన్, సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు.
*అసోంలో జాతీయ జనాభా రిజిస్టర్‌(ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా విడుదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జాబితాలో లేనివారి పేర్లను మాత్రమే ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. దాదాపు 19.06 లక్షల మందిని ప్రస్తుతానికి విదేశీయులుగా తేల్చారు. 3.11కోట్ల మందికి తుది జాబితాలో చోటు దక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో భారీగా భద్రతా బలగాలను మొహరించింది. గువాహటిలోని సచివాలయం, అసెంబ్లీ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో 144సెక్షన్‌ విధించారు. సున్నితమైన కశ్మీర్‌ అంశం ఇంకా చల్లారకముందే మరో కీలక అంశం ఎన్‌ఆర్‌సీ తుది జాబితా విడుదల కావడం గమనార్హం.
*రాష్ట్రంలో భారీగా డీఎస్పీ లు బదిలీ..ఒకేసారి 31 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సవాంగ్ ఉత్తర్వులు..
వెయిటింగ్ లో ఉన్న కొంతమంది డీఎస్పీ లకు పోస్టింగ్ లు ఇచ్చిన డీజీపీ..
*వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ పీవీ సింధు శనివారం ఉదయం హైదరాబాద్ నగరంలో ఉపరాష్ట్రపతి యం. వెంకయ్యనాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. సియోల్ వేదికగా జరిగిన కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో పీవీ సింధూ తనకు వచ్చిన బంగారుపతకాన్ని ఉపరాష్ట్రపతికి చూపించారు.
* పెద్దాపురం సమీపంలోని రామేశంమెట్ట జరుగుతున్న మైనింగ్ పై అర్ధరాత్రి రెవెన్యూ అధికారుల దాడులు. అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్న 12టిప్పర్లు, రెండు ఎక్సావేటర్లను సీజ్ చేసిన పెద్దాపురం తహశీల్దార్ పద్మావతి, సిబ్బంది.
* కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని నవీన్ మిట్టల్ కాలనిలో అడిషనల్ ఎస్.పి. సత్తిబాబు ఆధ్వర్యంలో కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కొత్త వ్యక్తుల ఆచూకీలు అడిగి తెలుసుకున్నారు.
* ఒకేసారి 31 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ సవాంగ్ ఉత్తర్వులు..వెయిటింగ్ లో ఉన్న కొంతమంది డీఎస్పీ లకు పోస్టింగ్ లు ఇచ్చిన డీజీపీ..
* ఏపీ ఎంత నీళ్లు అడిగితే అంత నీళ్లు కృష్ణా బోర్డు కేటాయించింది. తెలంగాణకు మాత్రం భారీ కోత పెట్టింది. పులిచింతలలో పుష్కలంగా నీళ్లున్నా కృష్ణా డెల్టా స్కీం(కేడీఎస్)కు నాగార్జునసాగర్‌ నుంచి 15 టీఎంసీలను కేటాయించింది. సెప్టెంబర్ వరకు 152 టీఎంసీలు కావాలని ఏపీ ఇండెంట్పెట్టగా.. అంతకు ఓకే చెప్తూ శుక్రవారం బోర్డు రిలీజ్ ఆర్డర్ను జారీ చేసింది.
*మానవ పరిణామక్రమానికి ఊపిరిలూదిన సాగరాలు ఇక పెను విధ్వంసాన్ని సృష్టించబోతున్నాయని ఐరాస ముసాయిదా నివేదిక హెచ్చరించింది.
*పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ అమలుకు రంగం సిద్ధమైంది. సెప్టెంబరు 6న ప్రారంభమై అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు అమలవుతుంది. ‘ఈ బృహత్తర కార్యక్రమాన్ని మొదట 60 రోజులు నిర్వహించాలనుకున్నాం.
*నీళ్లు, విద్యుత్తు ముసుగులో ప్రభుత్వం రూ.లక్షల కోట్ల దోపిడీకి పాల్పడుతోందని.. రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో రాజరాజేశ్వర జలాశయం (మధ్యమానేరు) ముంపు నిర్వాసితుల ఐక్యవేదిక, అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం బహిరంగ సభ నిర్వహించారు.
*ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 2018-19 సంవత్సరానికి 8.65 శాతం వడ్డీ చెల్లించాలని కేంద్ర కార్మిక శాఖ నిర్ణయించింది.
*చంద్రయాన్-2 చంద్రుడి ఉపరితలానికి మరింత చేరువవుతోంది. ఇప్పటికే చంద్రుడి కక్ష్యను తగ్గించుకునే దిశగా మూడు కీలక ప్రక్రియలను విజయవంతంగా దాటిన చంద్రయాన్-2 శుక్రవారం నాలుగో దశను ముగించింది.
*సమాజంలో భిన్న భావజాలాలు ఉన్న వ్యక్తుల మధ్య నిరంతరం సంభాషణలు సాగుతుండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. తాను నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తానని చెబుతూ ప్రజా జీవితంలో ఉన్నవారు ఇతరుల అభిప్రాయాలను వినాలని అన్నారు.
*పోలీసుశాఖలో 53 మంది సివిల్ ఇన్స్పెక్టర్లకు ప్రభుత్వం డీఎస్పీలుగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు
* బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో వచ్చే సోమవారం (సెప్టెంబరు 2) అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. తమిళనాడు కోస్తా ప్రాంతంపై, ఒడిశాపై 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనాలున్నాయి.
*సింగరేణితోపాటు రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల్లో సమ్మెలపై నిషేధం గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ వేర్వేరు ఉత్తర్వులను జారీచేసింది. విద్యుత్తు, బొగ్గు ఉత్పత్తి, సరఫరా అనేవి నిత్యావసర సేవల నిర్వహణ చట్టం కిందకు వస్తాయి కాబట్టి సమ్మెలు నిషేధించడం ఆనవాయితీ. ప్రతి 6నెలలకు గడువు పూర్తికాగానే ఇలా ఉత్తర్వులిస్తారు.
* భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో ఓటర్ల పేర్లలో తప్పుల సవరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్ తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
*రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సెప్టెంబరు 4న ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది.
*నాగార్జునసాగర్ కుడి కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల ఆయకట్టుకు సెప్టెంబరు 1న సాగునీటిని విడుదల చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరులో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
*ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ విధివిధానాలను రూపొందిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి కమిషన్ ఛైర్మన్ నియామకాన్ని చేపడతారు. వివిధ వర్గాల నుంచి స్వీకరించి నమోదు చేసిన వినతులను కమిషన్ వెబ్సైట్లో నమోదు చేస్తారు. వాటిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటారు. కమిషన్లో ఖాళీలను ఆరు నెలల్లోగా భర్తీ చేస్తారు.
*ఇంటర్మీడియట్ ప్రైవేటు విద్యార్థులకు హాజరునుంచి మినహాయింపు, గ్రూపు మార్పునకు అవకాశం కల్పిస్తూ ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కాంతిలాల్దండే ఉత్తర్వులిచ్చారు. ఆర్ట్స్ గ్రూపునకు చెందినవారు హాజరు మినహాయింపు రుసుము రూ.1300 వచ్చేనెల 23వ తేదీలోపు చెల్లించాలని సూచించారు.
*కర్ణాటక ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్‌ సవాడిని మంత్రివర్గంనుంచి తొలగించాలంటూ మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు ధర్నా చేశారు. శాసనసభలో పోర్న్‌ చిత్రాలు చూస్తూ దొరికిపోయారని కాంగ్రెస్‌ నాయకురాలు పుష్ప అమర్‌నాథ్‌ చెప్పారు. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని మోడీ జోక్యం చేసుకుని లక్ష్మణ్‌ను పదవినుంచి తొలగించాలని వారు కోరారు.
*టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మాజీ విప్ కూనరవిపై కేసుల విషయంలో తనకేమీ సంబంధం లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పుకొచ్చారు. రవిపై కేసులు, దౌర్జన్యాలకు తమ్మినేని కారణమని రవి భార్య తీవ్ర విమర్శలు చేయగా స్పందించిన తమ్మినేని ఖండించారు. బాధ్యతగల స్థానంలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలని, తన వ్యక్తిత్వం ఏమిటో అందరికీ తెలుసునని, రవిపై కేసులు పెట్టింది ఎన్జీఓలను తనకేం సంబంధమని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఆత్మగౌరవం ఉంటుందని, వాళ్ళపని వాళ్ళు చేసుకోవాలని వాళ్ళని బెదిరిస్తే వాళ్ళు తిరగబడ్డారన్నారు.