దేవుడు, పెద్దలంటే తనకు విశ్వాసం ఎక్కువ అని తెలంగాణ గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆలయాలకు వెళ్తారంటూ తనపై కొందరు చేసిన ఆరోపణలు ఎంతగానో బాధించాయని వాపోయారు. తెలంగాణకు కొత్త గవర్నర్ నియమితులైన నేపథ్యంలో ఆయన రాజ్భవన్లో మంగళవారం మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. తాను ఎక్కువగా తిరుపతి, యాదగిరిగుట్ట, భద్రాచలం ఆలయాలకే వెళ్లానని చెప్పారు. తొమ్మిదిన్నరేళ్లలో తనకు సహకరించిన మీడియాకు ధన్యవాదాలు చెబుతూ తన అనుభవాలను ఆయన పంచుకున్నారు. పోలీసులు కూడా ఎంతో సమర్థంగా విధులు నిర్వర్తించారని ప్రశంసించారు. ఇక్కడి నుంచి ఎన్నో మధుర జ్ఞాపకాలను తీసుకెళ్తున్నానని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ పార్టీలన్నీ సమన్వయంతో వ్యవహరించాయని అన్నారు. ఇప్పటికీ రోజూ హైదరాబాద్లోని ఆలయానికి వెళ్తానని గవర్నర్ స్పష్టం చేశారు. విభజన సమయంలో తాను తెలంగాణకు వ్యతిరేకమని ప్రచారం చేశారని గుర్తు చేసుకున్నారు. తొమ్మిదిన్నరేళ్ల పాటు తెలుగు రాష్ట్రాల్లో తాను నిర్వర్తించిన బాధ్యతలు ఎంతో సంతృప్తికరంగా ఉన్నాయన్నారు.
నేను ఆలయాలకు పెద్దగా వెళ్లలేదు. కేవలం మూడింటికి మాత్రమే.

Related tags :