Politics

ప్రతి ఇంటికీ కృష్ణ తులసిమొక్క

KCR Discusses Village Development Plans With Telangana Officials

పల్లెల రూపురేఖలు మార్చే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు సిద్ధమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్షేత్ర స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. ఈ నెల 6 నుంచి 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అన్ని గ్రామాల్లోనూ ప్రారంభం కానుండటంతో దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్లాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ వేదికగా జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, కలెక్టర్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ 30 రోజుల ప్రణాళిక ఉద్దేశాలు, లక్ష్యాలను వివరించడంతో పాటు వారికి స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. పచ్చదనం పరిశుభ్రతపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన నాలుగు పేజీల పత్రాన్ని కూడా అధికారులకు అందజేశారు. ‘‘సరిగా పనిచేయని కలెక్టర్లకు వార్షిక ప్రణాళికలో ప్రతి కూల మార్కులు ఉంటాయి. 85శాతంమొక్కలు బతికి తీరాల్సిందే. బాధ్యతా రాహిత్యం, లక్ష్యాలు చేరుకోని సర్పంచ్‌లపై వేటు తప్పదు. మిషన్‌ భగీరథతో పంచాయతీలపై మంచినీటి భారం తీరింది. వంద ఆకస్మిక తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తాం. 30 రోజుల ప్రణాళిక తర్వాత గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాం. లక్ష్యాన్ని సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు ఇస్తాం. అలసత్వం, అజాగ్రత్త ప్రదర్శించిన వారిపై చర్యలు తప్పవు’’ అని హెచ్చరించారు. ‘‘కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించాలి. ప్రతి ఇంటికీ 6 మొక్కలు ఇచ్చి సంరక్షించేలా చూడాలి. కావాల్సిన మొక్కల వివరాలు సేకరించాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శిదే. ప్రతి ఇంటికీ కృష్ణ తులసిమొక్క తప్పనిసరిగా ఇవ్వాలి. ఊరి విస్తీర్ణానికి అనుగుణంగా మొక్కలు నాటాలి. పచ్చదనం బాగా ఉండేలా చూసే కలెక్టర్లకు మార్కులు వేస్తాం. పచ్చదనం బాగా చూడని కలెక్టర్లకు ప్రతికూలమార్కులు వేస్తాం. ప్రజల భాగస్వామ్యంతోనే ఏదైనా విజయవంతమవుతుంది. అధికారులు రేపటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలి’’ అని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ‘‘పంచాయతీలకు నిధుల కొరత ఉండదు. ప్రతి ఊరిలోని 6 నెలల లోపు శ్మశానవాటిక ఏర్పాటు చేయాలి. 500 మంది జనాభా ఉన్న గ్రామానికి కూడా ఏటా రూ.8లక్షలు వస్తాయి. ఉద్యోగుల వయో పరిమితి పెంపుపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తాం’’ అని అన్నారు. అలాగే, మండల, జిల్లా స్థాయి అధికారుల సందేహాలను సీఎం నివృత్తి చేస్తూ.. ‘‘వందశాతం పన్నులు వసూలు చేయాలన్నారు. పన్నుల వసూలు బాధ్యత గ్రామ కార్యదర్శులదేనని స్పష్టంచేశారు. రాష్ట్రంలో 37 నియోజకవర్గాల్లోని అడవి అస్సలు లేదు. సూర్యాపేట, యాదాద్రి, జనగామ జిల్లాల్లో చాలా తక్కువ అడవి ఉంది. సామాజిక వనాల కింద చెట్లు బాగా పెంచాలి’’ అని సీఎం సూచించారు.