Sports

విశాఖలో 5ఎకరాలు ఇస్తానన్నారు. అందుకు సంతోషంగా ఉంది.

YS Jagan Promises 5Acres To Badminton Academy In Vizag

– సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ ను కలిసిన పివి సింధు
– పివి సింధును అభినందించిన ముఖ్యమంత్రి
– బ్మాడ్మింటన్‌ అకాడమీకి భూమి కేటాయించాలని కోరిన సింధు
– విశాఖపట్నంలో 5 ఎకరాలు కేటాయిస్తామని సీఎం హామీ: మంత్రి ముత్తంశెట్టి
– పివి సింధును అన్నిరకాలుగా ప్రోత్సహిస్తామన్నారు: మంత్రి ముత్తంశెట్టి
– సీఎంను కలవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన పివి సింధు
– అకాడమికి భూమి కేటాయిస్తామనడం పట్ల హర్షం.
– భవిష్యత్తులో అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని సీఎం హామీ ఇచ్చారు: సింధు

ప్రపంచ బ్మాడ్మింటన్‌ ఛాంపియన్‌ పివి సింధు వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ను కలిశారు. క్రీడాశాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పివి సింధు తల్లిదండ్రులు పివి రమణ, లక్ష్మి, క్రీడాసంఘాల ప్రతినిధి ఛాముండేశ్వరీనాద్, అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శాప్‌ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ను కలిశారు. ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్‌ పోటీల్లో సాధించిన బంగారు పతకంను ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆమెను అభినందించారు. పివి సింధును శాలువతో సత్కరించారు. అనంతరం సెక్రటేరియట్‌ లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలసి పివి సింధు మీడియాతో మాట్లాడారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంఫియన్‌ పివి సింధు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి తనను అభినందించడం సంతోషంగా వుందని అన్నారు. భవిష్యత్తులోనూ ఎప్పుడూ అండగా వుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే విశాఖపట్నంలో 5ఎకరాల భూమిని కేటాయిస్తామని చెప్పడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలవడం పట్ల ఆనందంగా ఉందన్నారు. పద్మభూషణ్‌ కోసం కేంద్రం తన పేరును నామినేట్‌ చేసినట్లు తెలిసిందని, చాలా సంతోషంగా ఉందన్నారు. దీనిపై ఇంకా అధికారికంగా సమాచారం రాలేదని తెలిపారు. గోల్డ్‌ మెడల్‌ సాధించిన తరువాత మొట్టమొదటి సారిగా మన రాష్ట్రానికి వచ్చిన బ్యాడ్మింటెన్‌ క్రీడాకారిణి పివి సింధుకు ఘనంగా ఆహ్వానం పలికామని రాష్ట్ర క్రీడాశాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఇవాళ ఆమె ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారని, పివి సింధు సాధించిన విజయం పట్ల సీఎం చాలా సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. అలాగే భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని సిఎం మనస్పూర్తిగా ఆకాంక్షించారన్నారు. రాబోయో ఒలంపిక్స్‌ లో పివి.సింధు గోల్డ్‌ మెడల్‌ సాధించాలని సిఎం కోరుకున్నారని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడపిల్లలకు ఒక బ్యాడ్మింటన్‌ అకాడమీ వుంటే బాగుంటుందని పివి సింధు కోరిన మీదట విశాఖపట్నంలో 5 ఎకరాలను కేటాయిస్తామని సిఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం అండగా వుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. మన తెలుగు అమ్మాయి అయిన సింధూకు అన్నిరకాల ప్రోత్సాహం ఇవ్వాలని సిఎం ఆదేశించినట్లు తెలిపారు.