NRI-NRT

అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా-6వ అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలు

6th Akkineni Foundation Of America Awards In Visakhapatnam

పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సమ్రాట్ డాక్టర్. అక్కినేని నాగేశ్వరరావు 96వ జయంతి సందర్భముగా (సెప్టెంబర్ 20) డాలస్ లో జరిగిన అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏ.ఎఫ్. ఏ) బోర్డు సమావేశం లో ప్రస్తుత అధ్యక్షురాలు శారద ఆకునూరి మాట్లాడుతూ — అనేక దశాబ్దాలుగా అక్కినేని నాగేశ్వరరావు గారితో సన్నిహితంగా మెలిగి ఆయనను 1997 లోను, 2012 లోను ఆహ్వానించి టెక్సాస్ కు తీసుకురావడంలో ముఖ్య కారకులైన డా. తోటకూర ప్రసాద్ నాయకత్వంలోనే 2014 లో ఈ ఎ.ఎఫ్.ఏ సంస్థను ఏర్పాటు చేశామని తెలియజేశారు. అప్పటినుండి ఇప్పటికివరకు ఐదు అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరుపుకున్నామని, ఈ సంవత్సరం డిసెంబర్ 21న సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నం లో వి.ఎం.ఆర్డి.ఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఆరవ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్స వాన్ని జరుపుతున్నట్లు ప్రకటించి అందరూ హాజరు కావలసినదిగా ఆహ్వానం పలికారు. ఈ సమావేశంలో బోర్డు అఫ్ డైరెక్టర్స్ – డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం, రావు కల్వల, డా. సి. ఆర్. రావులు అక్కినేని గారితో తమకున్న ప్రత్యేక అనుభందాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ డా. అక్కినేనిని ఒక ప్రముఖ సినిమా నటుడి గా మాత్రమే గాక, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషిగా, ఆయన అంతిమ శ్వాస వరకు అత్యంత సన్నిహితంగా మెలిగిన అమెరికా లోని మిత్రులం కొంతమంది “అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” సంస్థను ఏర్పాటుజేశామని తెలిపారు. డా. అక్కినేని ఒక చిన్న కుగ్రామంలో , అతిసాధారణ కుటుంబంలో జన్మించి కేవలం కృషి, పట్టుదల, ఆత్మ స్తైర్యం, దూరదృష్టితో అద్భుత విజయాలు సాధించడం అనన్య సామాన్యమని, ఈ అంశాలనే ముఖ్యంగా యువతలో ప్రేరేపించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం డిసెంబర్ లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలను జరుపుతున్నామని తెలియజేశారు. 2014 లో గుడివాడ, 2015 లో హైదరాబాద్, 2016 లో చెన్నై, 2017 లో ఏలూరు, 2018 లో కరీంనగర్ లో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరిగాయి.

ఈ సంవత్సరం అక్కినేని అంతర్జాతీయ పురస్కార గ్రహీతలు –

“జీవిత సాఫల్య పురస్కారం” – శ్రీ మాగంటి మురళీ మోహన్, సినీ, వ్యాపార, రాజకీయ రంగాలలో ప్రముఖులు

“విద్యా రత్న” – ప్రొఫెసర్. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఛైర్మన్

“సినీ రత్న” – “మహానటి” చిత్ర బృందం, జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్న చిత్రం

“వ్యాపార రత్న”- డా. సూరపనేని విజయ కుమార్, నిర్మాణ రంగంలో అగ్రగ్రామి, కళాపోషకులు

“రంగస్థల రత్న” – పద్మశ్రీ డాక్టర్. శోభానాయుడు, కూచిపూడి నృత్యంలో అగ్రశ్రేణి నర్తకి, నాట్యాచారులు

“వైద్య రత్న” – డాక్టర్. ముళ్ళపూడి వెంకటరత్నం, సామాన్య ప్రజల పాలిట పెన్నిధి
“సేవా రత్న” – “మన కోసం మనం ట్రస్ట్” – చల్లపల్లి, పరిశుభ్రత, పచ్చదనంలో సమిష్టి కృషి

“వినూత్న రత్న” – శ్రీ సత్తిరాజు శంకర నారాయణ, పెరేన్నికగన్న పెన్సిల్ డ్రాయింగ్ ఆర్టిస్ట్

“యువ రత్న” – శ్రీ ఫణికెర క్రాంతి కుమార్, సాహసవీరుడు

ఈ సంస్థకు డాక్టర్. ప్రసాద్ తోటకూర (వ్యవస్థాపక అధ్యక్షులు), శారద అకునూరి (అధ్యక్షులు), చలపతి రావు కొండ్రకుంట (ఉపాధ్యక్షులు), డాక్టర్. సి.ఆర్. రావు, ( కార్యదర్శి), రవి కొండబోలు (కోశాధికారి), రావు కల్వల, ధామా భక్తవత్సలు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలకు వ్వ్వ్.అక్కినెనిఫౌందతిఒనొఫమెరిచ.ఒర్గ్ను సందర్శించండి.