* దీపావళిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యం 5 శాతం పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ బుధవారం ప్రకటించారు. ఈ ఉదయం జరిగిన కేబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీంతో సర్కారు ఉద్యోగులకు ఇచ్చే కరవు భత్యం 17 శాతానికి చేరినట్లు వెల్లడించారు.
* రసాయన శాస్త్రంలో విశేష సేవలందించిన ముగ్గురికి నోబెల్ పురస్కారం వరించింది. జాన్ బి.గుడెనఫ్, ఎం.స్టాన్లీ విట్టింగమ్, అకిరా యోషినోకు ఈ పురస్కారాన్ని సంయుక్తంగా అందజేయనున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ సెక్రటరీ జనరల్ గోరన్ కె.హాన్స్న్ ప్రకటించారు. లిథియం ఆయాన్ బ్యాటరీ అభివృద్ధికి చేసిన విశేష పరిశోధనలకు వారికి ఈ పురస్కారం లభించింది.
* టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. ఆయన్ను 10 రోజుల కస్టడీకి అప్పగించాలంటూ నాంపల్లి కోర్టుకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టులో బుధవారం విచారణ జరిగింది. పిటిషన్ను విచారించిన కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. రవిప్రకాశ్ ప్రస్తుతం చంచల్గూడ జైలులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు.
* రామినేని ఫౌండేషన్ సేవలు శ్లాఘనీయమని మాజీ క్రికెటర్ కపిల్దేవ్ అన్నారు. గుంటూరులో రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కపిల్ మాట్లాడారు. ‘ నేనో పేద విద్యార్థిని. నా గురువులు ఇప్పటికీ గుర్తున్నారు. విద్యార్థులపై గురుతర బాధ్యత ఉంది. దేశ భవిష్యత్ విద్యార్థులపైనే ఆధారపడి ఉంది. ఏ వృత్తినైనా ప్రేమిస్తే అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు’’ అని కపిల్ దేవ్ అన్నారు.
* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెపో రేటులో 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన కొన్ని రోజుల్లోనే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ను 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో బ్యాంకు వార్షిక ఎంసీఎల్ఆర్ 8.15 శాతం నుంచి 8.05 శాతానికి తగ్గనుంది. తద్వారా గృహ రుణాలపై వడ్డీరేటు తగ్గే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఎంసీఎల్ఆర్ను తగ్గించడం ఇది ఆరోసారి కావడం విశేషం.
* జంటనగరాల్లో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. జేఎన్టీయూ,కూకట్పల్లి, ఎర్రగడ్డ, మూసాపేట, అమీర్పేట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, రాజ్భవన్ రోడ్డు, కోఠి, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నగరంలో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
* ఆండ్రాయిడ్, ఐఓఎస్లు తమ కొత్త వెర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో సిస్టమ్ వైడ్ డార్క్ మోడ్ను లాంచ్ చేశాయి. దీంతో యాప్లన్నీ డార్క్ మోడ్ నామజపం చేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్ యాప్స్ డార్క్ మోడ్ ఆప్షన్ను టెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ కూడా ఇటువైపు చూస్తోంది. తన ఇన్స్టాగ్రామ్లో డార్క్ మోడ్ను టెస్టింగ్ చేస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్లు బయటికొచ్చాయి.
* ప్రస్తుత క్రికెట్లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ పరిమిత ఓవర్ల ఆటలో అత్యుత్తమ నాయకుడని, కోహ్లీ శక్తి సామర్థ్యాలు టెస్టుల్లో అతడిని ఉత్సాహభరితమైన కెప్టెన్గా నిలుపుతాయని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్వాన్ తెలిపాడు. ‘అంతర్జాతీయ క్రికెట్లో ధోనీ ఇప్పుడు కెప్టెన్సీ చేయకపోయినా నేను చూసిన బెస్ట్ కెప్టెన్ అతడే’ అని మైఖేల్వాన్ అన్నారు.
* త్వరలో భారత్ పర్యటనకు రానున్న చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కశ్మీర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో పరిస్థితిని పరిశీలిస్తున్నామని, పాక్కు చెందిన ప్రధాన అంశాల వరకు ఆ దేశానికి మద్దతిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆ దేశ అధికార న్యూస్ ఏజెన్సీ జిన్హువా పేర్కొంది. ఏది తప్పు, ఏది ఒప్పు అనేది స్పష్టంగా తెలుస్తోందని పాక్ ప్రధానితో జిన్పింగ్ అన్నట్లు తెలిపింది.
* ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఉద్దీపన చర్యల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. గత ఆరు సెషన్లలో నష్టాలను చవి చూసిన సూచీలు లాభాల బాటపట్టాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 645 పాయింట్లు లాభపడి, 38,177వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 186 పాయింట్ల లాభంతో 11,300మైలురాయిని దాటింది. డాలర్తో రూపాయి మారకం విలువ 70.96గా ఉంది.
* హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె బుధవారానికి ఐదో రోజుకు చేరుకుంది. సమ్మెపై నేడు కీలక చర్చలు జరగనున్నాయి. ప్రభుత్వంతో ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. ఆర్టీసీ సమ్మెపై అఖిలపక్షాలు చర్చలు జరపనున్నాయి. మరోవైపు పూర్తి కార్యాచరణకు కార్మిక సంఘాల జేఏసీ సిద్ధమవుతోంది.
* నేటి నుంచి దేశవ్యాప్తంగా డాక్టర్లు ఆందోళనలకు దిగుతున్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లుకు వ్యతిరేకంగా వైద్యులు నిరసనలు చేపడుతున్నారు.
* తిరుమలలో నేటి నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభమవుతాయి. నేటి నుంచి దివ్య దర్శనం, టైమ్స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నారు.
* విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి భవానీ భక్తులు దీక్ష విరమించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు.
* దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ ఉదయం 10.30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.
* ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న 24 గంటల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
* ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి వెళ్లనున్నారు. వైఎస్సార్సీపీ రాజమండ్రి నగర సమన్వకర్త శివరామసుబ్రహ్మణ్యం కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి హాజరవుతారు.
* జమ్మూకశ్మీర్లో పరిస్థితులు అదుపులోకి రావడంతో పాఠశాలలు, కాలేజీలు నేడు పునఃప్రారంభం కానున్నాయి. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో దాదాపు 60 రోజులుగా స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.
* ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుండి జగన్ ఆ రెండు జిల్లాల మీదే ఫోకస్ చేస్తున్నారు. అక్కడ ఎవరు అధిక సీట్లు సాధిస్తే వారు అధికారంలోకి వస్తారు. అదే 2014లో జరిగింది. దానిని జగన్ 2019 ఎన్నికల్లో తన వైపు తిప్పుకోవటంతో అధికారంలోకి వచ్చారు. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలని భావిస్తున్న జగన్..సామాజిక సమీకరణాల్లో మాత్రం పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడుతున్నారు. అదే జగన్ సక్సెస్ కు కారణమైంది. ఇక, ఏపీలో ఉభయ గోదావరి జిల్లాలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. పదవుల నుండి మొదలు పధకాల ప్రారంభం వరకు అక్కడే ఫోకస్ చేస్తున్నారు. అదే విధంగా అక్కడ తనకు దూరంగా ఉన్న వర్గాలను దగ్గర చేసుకొనే వ్యూహాలు అమలు చేస్తున్నారు. కొన్ని సామాజిక వర్గాల నేతలను కలిపి తన పార్టీలో పని చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు ఓట్ బ్యాంక్ గా..ఒక ప్రధాన వర్గం తమతోనే ఉందని భావిస్తున్న పవన కు అదే విధంగా బీసీలు తమతో ఈ సారి ఎన్నికల్లో లేకపోయినా..భవిష్యత్ లో ఖచ్చితంగా తమతోనే వస్తారని ఆశిస్తున్న టీడీపీకి అవకాశం లేకుండా అక్కడ ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఇచ్చిన తీర్పుతో జగన్ సీఎం అయ్యారు. దీంతో..రెండు జిల్లాలకు ఇద్దరు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. పశ్చిమ నుండి కాపు వర్గానికి ఇవ్వగా..తూర్పు నుండి బీసీ వర్గానికి చెందిన వారికి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. ఆ ఇద్దిరినే ఆ రెండు జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులుగా నియమించారు. ఇక, కీలక పధకాల అమలు అక్కడి నుండే ప్రారంభిస్తున్నారు. ముక్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థను తూర్పు గోదావరి నుండి ప్రారంభిస్తే.. వైయస్సార్ వాహన మిత్ర పధకాన్ని పశ్చిమ గోదావరి నుండి ఆరంభించారు. కాపు కార్పోరేషన్ ఛైర్మన్ పదవిని తూర్పు గోదావరికి చెందిన ఎమ్మెల్యే రాజాకు అప్పగించారు.