రామినేని ఫౌండేషన్ సేవలు శ్లాఘనీయమని మాజీ క్రికెటర్ కపిల్దేవ్ అన్నారు. గుంటూరులో రామినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా పురస్కారాలు ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా కపిల్ మాట్లాడుతూ.. ఏ సంస్థనైనా ప్రారంభించడం సులువేనని.. అయితే దానిని కొనసాగించడమే కష్టమని అన్నారు. గురువులను విద్యార్థులు గౌరవించడం ప్రాథమిక విధి అని తెలిపారు. ‘నేనో పేద విద్యార్థిని. నా గురువులు ఇప్పటికీ గుర్తున్నారు. విద్యార్థులపై గురుతర బాధ్యత ఉంది. దేశ భవిష్యత్ విద్యార్థులపైనే ఆధారపడి ఉంది. ఏ వృత్తినైనా ప్రేమిస్తే అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు’’ అని కపిల్ దేవ్ అన్నారు. ఈ సందర్భంగా 106 మంది ఉపాధ్యాయులకు గురు పురస్కారాలు, 84 మందికి గురు సన్మానాలు ప్రదానం చేశారు. మరో 261 మంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మంత్రి ఆదిమూలపు సురేశ్, మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
రామినేని పురస్కారాలు అందజేసిన కపిల్దేవ్
Related tags :