Politics

విశాఖ ఎయిర్‌పోర్టు నా ఘనతే

I developed Vizag unlike any other says chandrababu in vizag

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసినప్పుడల్లా సంతోషం కలుగుతుందని.. హైదరాబాద్ నగరంగానీ, విశాఖ ఎయిర్‌పోర్టు, విశాఖ నగరంలో చేసిన అభివృద్ధి చూసినప్పుడు ఆనందం కలుగుతుందని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. గురువారం విశాఖలోని టీడీపీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ భవిష్యత్తులో టీడీపీని గుర్తుపెట్టుకునేలా పునాదులు వేయాలనేదే తమ లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అతి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఖ్యాతి తనకే దక్కిందన్నారు. ఓడిపోయామని భయం ఉండకూడదని, ప్రజల పక్షాన పోరాటం చేయాలని నేతలకు సూచించారు. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంను తొక్కి పెట్టాలని చూస్తే ఇంకా రెచ్చిపోతారు తప్పితే, అనిగి పోరని చంద్రబాబు అన్నారు. తాను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని, ప్రతి ఒక్కరి జాతకాలు తనకు తెలుసునని అన్నారు. మంచిగా ఉంటే బాగుంటుందని, తమాషాలు చేయాలని చూస్తే సాధ్యం కాదని గట్టిగా హెచ్చరించారు. పోలీసుల్లో కొంత మంది అతిగా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసు వ్యవస్థ శాంతి భద్రతలు కాపాడి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. గతంలో తానెప్పుడు ఇంతగా పోరాడలేదని, నాలుగు నెలలుగా పోరాటం చేస్తున్నానన్నారు. వైసీపీ శ్రేణులు నాలుగు నెలల్లో 12 మందిని చంపేశారని, 570 దాడులు చేశారని, 120 కుటుంబాలు గ్రామాలు వదిలి వెళ్ళే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు.