Politics

మోడీలను కించపరచలేదు

Rahul Gandhi Appears Before Court Over Insulting Modis

తాను ఏ తప్పూ చేయలేదని, ఎవర్నీ కించపరచలేదని కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌గాంధీ ఇక్కడి మేజిస్ట్రేట్‌ కోర్టుకు తెలిపారు. ఏప్రిల్‌ 13న కర్ణాటకలోని కోలార్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ… ‘‘నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ, నరేంద్ర మోదీ… వారందరి ఇంటిపేరు ఒక్కటే. దొంగలంతా ఒకే ఇంటి పేరు పెట్టుకున్నారు’’ అని వ్యాఖ్యానించారు. అయితే, కాంగ్రెస్‌ నేత తన వ్యాఖ్యల ద్వారా మోదీ వర్గమంతటిని అవమానించారంటూ సూరత్‌-పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు పూర్ణేశ్‌ మోదీ పరువునష్టం దావా వేశారు. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన రాహుల్‌గాంధీ… గురువారం ఈ కేసు విచారణ నిమిత్తం చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ బి.హెచ్‌.కపాడియా ముందు హాజరయ్యారు. ‘మీపై వచ్చిన ఆరోపణలను అంగీకరిస్తున్నారా?’ అని ఆయన ప్రశ్నించగా… తాను ఏ తప్పూ చేయలేదని, ఆరోపణల్లో నిజం లేదని రాహుల్‌ బదులిచ్చారు. తదుపరి విచారణ డిసెంబరు 10న జరుగనుంది. సూరత్‌లో తనకు బాసటగా నిలిచేందుకు తరలివచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలకు రాహుల్‌ ట్విట్టర్‌లో ధన్యవాదాలు తెలిపారు.