పురుషాధిక్య బీసీసీఐలో ఓ మహిళా క్రికెటర్కు ప్రాతినిధ్యం దక్కుతుందని కలలోనైనా ఊహించలేదని మాజీ క్రికెటర్ శాంత రంగస్వామి అన్నారు. జస్టిస్ ఆర్ఎం లోధా సిఫార్సుల వల్లే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. బీసీసీఐ తొమ్మిది మంది సభ్యుల అత్యున్నత మండలిలో ఆమెకు దాదాపు చోటు ఖాయమైంది. భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) ఎన్నికల్లో ఆమె పోటీ లేకుండా ఎంపికకానున్నారు. అక్కడి నుంచి బీసీసీఐ అత్యున్నత మండలిలో ప్రాతినిధ్యం వహించనున్నారు. ‘బోర్డులో నేను భాగమవుతానని కలలోనైనా అనుకోలేదు. కనీసం ఓ పురుష క్రికెటరైనా ప్రాతినిధ్యం వహిస్తాడని ఊహించలేదు. కొందరు లోధా సిఫార్సులను తిట్టుకోవచ్చు. కానీ, దానివల్లే బోర్డులో ఇప్పుడు మా గళం వినిపించనుంది. ఇది పురుషుల కోటలో తుపానులాంటిది’ అని శాంత రంగస్వామి అన్నారు. బీసీసీఐ గుర్తింపునకు నోచుకోని రోజుల్లో భారత మహిళా క్రికెట్ జట్టుకు శాంత సారథ్యం వహించారు. బీసీసీఐ జీవితకాల పురస్కారానికి ఎంపికైన తొలి మహిళా క్రికెటర్ ఆమే కావడం గమనార్హం. బీసీసీఐలో అత్యున్నత మండలి ఏర్పాటు కాగానే మహిళల క్రికెట్ అభివృద్ధి కోసం ఐదు అంశాల దార్శనికతను శాంత రంగస్వామి బోర్డు ముందు ఉంచనున్నారు. బీసీసీఐ మద్దతుతో ఇప్పటికే మహిళల క్రికెట్ ఒక కెరీర్ అవకాశంగా మారింది. అయితే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మహిళా క్రికెటర్లకు కనీసం రంజీ పురుష క్రికెటర్లకు ఇచ్చే స్థాయిలోనైనా పింఛను ఇవ్వాలని కోరనున్నారు. మహిళా క్రికెట్ కోచ్ల పరిస్థితి మెరుగుదల కోసం పోరాడనున్నారు. బాలికల అండర్-16 టోర్నీలు నిర్వహించాలని కోరనున్నారు.
బీసీసీఐ బోర్డులోకి శాంత రంగస్వామి
Related tags :