Politics

కేసీఆర్ పనితీరుపై ఆగమాగమయిన నాగం

Nagam Janardhana Reddy Fires On KCR

తెలంగాణలో జరుగుతున్నంత అవినీతి దేశంలో ఎక్కడా జరగడంలేదని నాగం విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై నాటి గవర్నర్ నరసింహన్‌కు లేఖ రాస్తే దాన్ని పట్టించుకోలేదన్నారు. రాష్ట్ర ప్రజలను బిచ్చగాళ్లను చేసేలా కేసీఆర్ పాలన ఉందని నాగం జనార్దన్‌రెడ్డి ఆక్షేపించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. సెల్ఫ్ డిస్మిస్ అంటూ సుమారు 50వేల మంది ఆర్టీసీ కార్మికులను రోడ్డున పడేశారని.. కేసీఆర్‌కు వారి ఉసురు తగులుతుందన్నారు. నూతన సచివాలయం, అసెంబ్లీ నిర్మాణాల పేరిట అవినీతి చేసేందుకు సీఎం తెరలేపారని నాగం ధ్వజమెత్తారు.. సీఎం కేసీఆర్‌ తెలంగాణను దోచుకుంటున్నారని కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చేశారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ను జైలుకు పంపేవరకు ఆయన అవినీతిపై తాను పోరాటం చేస్తానని చెప్పారు. రూ.24వేల కోట్ల విలువైన బీటీ రహదారుల కాంట్రాక్ట్‌ను ఒకే సంస్థకు కట్టబెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని నాగం ఆరోపించారు. ఆంధ్రావాళ్లు దోచుకుంటున్నారని గతంలో ఆరోపించిన కేసీఆర్‌.. నేడు అక్కడి గుత్తేదారులకు స్వయంగా దోచి పెడుతున్నారని మండిపడ్డారు.