‘దొంగా దొంగది’, ‘పోటుగాడు’, ‘కరెంట్ తీగ’ వంటి పలు చిత్రాల్లో నటించి కథానాయకుడిగా మంచి గుర్తింపు తెచుకున్నారు టాలీవుడ్ నటుడు మంచు మనోజ్. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ముఖ్య విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ తాను మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పారు. దీంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనోజ్ సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టినట్లు ఆదివారం ప్రకటించారు. ఎం.ఎం.ఆర్ట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించినట్లు దీపావళి పండుగ సందర్భంగా ఆయన తెలిపారు. ‘నా కొత్త ప్రయాణం ప్రారంభమయ్యింది. ఎం.ఎం.ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌస్ జన్మించింది. నా కొత్త సినిమాకు సంబంధించిన పనులు ఎం.ఎం.ఆర్ట్స్ పతాకంపై చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా నేను కొత్త టాలెంట్తోపాటు, గొప్ప సినిమాలను అందిస్తాను. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు.’ అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా తన కొత్త ప్రయాణానికి ప్రతిఒక్కరి నుంచి ఆశీస్సులు కావాలని కోరారు.
మంచు మనోజ్ ప్రొడక్షన్స్
Related tags :