Politics

30ఏళ్ల కిందటి ముచ్చట-నేను చినజీయర్ డ్రైవర్‌ని

30ఏళ్ల కిందటి ముచ్చట-నేను చినజీయర్ డ్రైవర్‌ని

తనకు అంతకుముందెప్పుడూ చినజీయర్‌స్వామితో పరిచయం లేదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. 1986 – 87లో సిద్ధిపేటలో బ్రహ్మయజ్ఞం తలపెట్టారనీ.. ఈ క్రమంలో భక్తులు, వికాస తరంగిణి మిత్రులంతా తన వద్దకు వచ్చి ఇదో మంచి కార్యక్రమం, మనం తప్పకుండా చేయాలంటూ తనవద్దకు వచ్చారని సీఎం గుర్తు చేసుకున్నారు. దీనికి తానూ సరే అనడంతో పనులు ప్రారంభించామన్నారు. తమ గ్రామంలో అప్పుడు బ్రాహ్మణ పరిషత్‌ లేదనీ.. స్వామీజీ ఉండేందుకు సరైన చోటు కూడా లేకపోవడంతో గ్రామస్థులు వచ్చి చినజీయర్‌ను తన ఇంట్లోనే ఉంచాలని చెప్పారన్నారు. అంతకన్నా అదృష్టం ఏముంటుందనే ఉద్దేశంతో చినజీయర్‌ స్వామిని ప్రార్థిస్తే ఆయన అనుగ్రహించారని సీఎం వివరించారు. ఆ ఏడు రోజులూ ఆయన తమ ఇంట్లోనే బస చేశారని వెల్లడించారు. ఆ సమయంలో తాను స్వామీజీకి కారు డ్రైవర్‌గా మారిపోవడం.. పలు ఆలయాలకు తిరగడం జరిగిందని తెలిపారు. ఆ ఏడెనిమిది రోజులు తానే కారును డ్రైవ్‌ చేయడంతో ఆయనతో పాటే ఉండటంతో స్వామీజీ చేసిన అనుగ్రహ భాషణలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. భగవద్‌ రామానుజాచార్య విగ్రహం హైదరాబాద్‌లో వెలవడం చాలా గర్వకారణమని కేసీఆర్‌ అన్నారు. ఆ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా చేసుకుందామని చెప్పారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో తానూ ఓ సేవకుడిలా పాల్గొంటానన్నారు.