Politics

చేసిన ఖర్చులకు ఫలితాలు ఉండాలి-సీఎం జగన్

YS Jagan Wants Expenses And Results Correlated Well

రానున్న 40 రోజుల్లో రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు వరద నీటితో నిండాలని.. ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ప్రతిపాదనలతో పూర్తి నివేదిక అందివ్వాలని సూచించారు.తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జలవనరులశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఇంత వరద వచ్చినా కొన్ని ప్రాజెక్టులు పూర్తిగా నిండక పోవడానికి గల కారణాలపై జగన్‌ ఆరా తీశారు. కృష్ణా, గోదావరి, పెన్నా బేసిన్లలో ఉన్న రిజర్వాయర్ల నీటిమట్టాలు, ప్రస్తుత పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాంతాలు, ప్రాజెక్టులు, జిల్లాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటికే పనులు జరుగుతున్న పోలవరం, వెలిగొండ, వంశధార సహా ప్రతిపాదిత ప్రాజెక్టులపైనా అధికారులతో సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. కాల్వల సామర్థ్యం, పెండింగులో ఉన్న పనులపై అధికారుల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టాల్సిన ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో విభజించి ఆమేరకు అంచనాలను నివేదిక ద్వారా అందివ్వాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. నిధుల వినియోగంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ప్రాధాన్యతల పరంగా ఖర్చు చేయాలని.. చేసిన ఖర్చుకు ఫలితాలు వచ్చేలా ఉండాలని సీఎం ఆదేశించారు.