DailyDose

నేటి పది ప్రధాన వార్తలు-11/12

Telugu Top Breaking News Today-11/12

1. అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలిగిన సింగపూర్‌.
ఏపీ రాజధానిలోని స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నట్లు సింగపూర్‌ ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుంచి తాము వైదొలగుతున్నట్లు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రకటించారు. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధిపై కొన్ని ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఏపీ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
2. ఇసుక సమస్యకు వైకాపా నేతలే కారణం: తెదేపా.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెదేపా ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ఇసుక సమస్యకు వైకాపా నేతలు, మంత్రుల దోపిడీయే కారణమని తెదేపా నేతలు మండిపడ్డారు. ఇసుక మాఫియాలో వైకాపా నేతల పాత్ర ఉందని వారు ఆరోపించారు. రాష్ట్రంలోని ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందని అన్నారు. ఇసుక మాఫియాలో 67 మంది వైకాపా నేతల పాత్ర ఉందని వారు విమర్శించారు.
3. వాగులో పడి ముగ్గురు విద్యార్థుల మృతి.
సిద్దిపేట జిల్లా కొహెడ మండలం వరికోలులో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వాగులో మునిగి మృతి చెందారు. వరికోలు గ్రామానికి చెందిన కంటె నిఖిల్‌(19), కూన ప్రశాంత్‌(20), పి.వరప్రసాద్‌(18) మంగళవారం ఉదయం కార్తీక పౌర్ణమి కావడంతో స్నానం చేసుకునేందుకు గ్రామశివారులో ఉన్న మోయతుమ్మిదవాగులోకి మృత్యువాతపడ్డారు.
4. వేచి చూసే ధోరణిలో భాజపా
మహారాష్ట్రలో అధికార బంతి చివరకు ఎన్‌సీపీ కోర్టుకు చేరింది. గవర్నర్‌ ఇచ్చిన గడువులోగా శివసేన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టలేకపోవడంతో ఎన్‌సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే ఈ పరిణామాలన్నింటినీ భాజపా నిశితంగా పరిశీలిస్తోంది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని చెప్పి బంతిని సేన కోర్టులోకి నెట్టిన భాజపా తిరిగి అది తమ మైదానంలోకే వచ్చి చేరుతుందని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
5. అరవింద్‌ సావంత్‌ బాధ్యతలు జావడేకర్‌కు.
శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌ కేంద్రమంత్రి పదవికి చేసిన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహా మేరకు సావంత్‌ రాజీనామాను తక్షణమే ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇప్పటివరకు సావంత్‌ చేపట్టిన భారీ పరిశ్రమలు, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖను కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు అప్పగించారు.
6. భాజపాకు రూ.700కోట్ల విరాళాలు.
అధికార భాజపాకు 2018-19 ఆర్థిక సంవత్సరంలో అందిన విరాళాలను ఆ పార్టీ వెల్లడించింది. వివిధ సంస్థలు, ట్రస్టుల నుంచి రూ.700కోట్లు అందాయని ప్రకటించింది. చెక్కులు, ఆన్‌లైన్ చెల్లింపుల రూపంలో ఈ మొత్తం సమకూరిందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదికలో తెలిపింది. అయితే ఈ విరాళాల్లో దాదాపు సగం టాటాసన్స్‌ నేతృత్వంలోని ‘ప్రోగ్రెసివ్‌ ఎలక్టోరల్‌ ట్రస్టు’ నుంచే రావడం గమనార్హం.
7. బంగ్లాదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.
బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొని 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. కస్బా ప్రాంతంలోని మండోల్‌బాగ్‌ స్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఢాకా వైపు వెళ్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ఎదురుగా చిట్టగాంగ్‌ వైపు వస్తున్న మరో రైలును వేగంగా ఢీకొట్టింది.
8. టీమిండియా ‘బాస్’ అని నిరూపించుకుంది.
బంగ్లాదేశ్‌పై టీ20 సిరీస్‌ గెలిచిన టీమిండియాను క్రికెట్‌లో ‘బాస్‌’గా అభివర్ణించాడు పాకిస్థాన్‌ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌. మూడో టీ20లో భారత్‌ విజయం సాధించిన తర్వాత తన యూట్యూబ్‌ ఛానల్లో స్పందించారు. ‘ఈ మ్యాచ్‌లో బాస్‌ ఎవరో టీమిండియా నిరూపించింది. తొలి టీ20లో ఓటమిపాలైనప్పటికీ తిరిగి పుంజుకొని సిరీస్‌లో పైచేయి సాధించింది. రోహిత్‌ గొప్ప నైపుణ్యం గల ఆటగాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పరుగులు చేయగలడు’ అని మెచ్చుకున్నాడు.
9. ఈ భారత ఐటీ కంపెనీలకు నో హెచ్‌-1బీ.!
అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) తాజా నివేదిక ప్రకారం భారత ఐటీ కంపెనీలకు వీసా నిబంధనల్ని అమెరికా మరింత కఠినతరం చేస్తున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌సీఐఎస్ తాజా అధ్యయనం ప్రకారం పలు ఇండియన్ ఐటీ కంపెనీలను హెచ్‌-1బీ వీసాలు పొందే సంస్థల జాబితా నుంచి తొలగించినట్లు సమాచారం. ఇక ఆయా సంస్థలు హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది.
10.గవర్నర్‌తో ముగిసిన పవన్ భేటీ
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భేటీ ముగిసింది. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఇసుక కొరత, రాష్ట్రంలో ఉన్న ఇతర అంశాలపై గవర్నర్‌కు పవన్ వినతిపత్రం ఇచ్చారు. గవర్నర్‌తో దాదాపుగా అరగంటకు పైగా చర్చించినట్టు సమాచారం. ఇటీవల రాష్ట్రంలో ఉన్న ఇసుక కొరతపై పవన్, విశాఖలో లాంగ్‌మార్చ్ నిర్వహించారు. అయితే లాంగ్‌మార్చ్‌పై వైసీపీ నేతలు, పవన్‌పై ముప్పేట దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్, గవర్నర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.