ScienceAndTech

2020లో చంద్రయాన్-3

Chandrayaan-3 Coming In 2020-Telugu Science And Technology News

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్‌-2’ చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తి విఫలమైన విషయం తెలిసిందే. ఇందులోని విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ కాలేకపోయింది. అయితే చంద్రుడిపై కాలుమోపాలన్న ఇస్రో సంకల్పం మాత్రం ఇంకా బలంగానే ఉంది. మరోసారి చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టేందుకు ‘చంద్రయాన్‌-3 ’దిశగా ఆ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ఇస్రో సిద్ధమవుతోంది.

ప్రతిపాదిత ‘చంద్రయాన్‌-3’కి సంబంధించి నివేదికను తయారు చేయాలని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎస్‌.సోమనాథ్‌ నేతృత్వంలోని కమిటీని ఇస్రో అడిగినట్లు సమాచారం. ‘ప్యానల్‌ నివేదిక కోసం వేచి చూస్తున్నాం. వచ్చే ఏడాది చివరి నాటికి మిషన్‌ను సిద్ధం చేయడానికి ఈ కమిటీకి మార్గదర్శకత్వం చేశాం. నవంబర్‌లో ప్రయోగానికి సరైన లాంచ్‌ విండో ఉంది’ అని సీనియర్‌ ఇస్రో అధికారి పీటీఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు. ‘ఈ ప్రయోగంలో రోవర్‌, ల్యాండర్‌ సహా ల్యాండింగ్‌ ఆపరేషన్లపై ఈసారి మరింత దృష్టి పెట్టనున్నాం. చంద్రయాన్‌-2లో తలెత్తిన లోపాలను సరిచేస్తాం’ అని ఆయన వెల్లడించారు. చంద్రయాన్‌-2 ద్వారా ప్రయోగించిన ఆర్బిటర్‌ విజయవంతంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఈ కొత్త మిషన్‌లో ల్యాండర్‌, రోవర్‌ మాత్రమే ఉండనున్నట్లు సమాచారం.

సెప్టెంబర్‌ 7న విక్రమ్‌ ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో చివరి నిమిషంలో దానితో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఆర్బిటర్‌ మాత్రం తనకు అప్పగించిన పనిని విజయవంతంగా నిర్వహిస్తోంది.