Devotional

తిరుమల దర్శనాల్లో రకాలు

Types Of Darshans In Tirumala-TTD Darshan Info

తిరుమల పేరు చెప్పగానే వేంకటేశ్వర స్వామిని కాసేపు కనులారా చూసుకుందామని అనిపిస్తుంది. సాధ్యమవుతుందా? అసలు ఎన్ని రకాల దర్శనాలున్నాయి? అవి ఎప్పుడెప్పుడు జరుగుతాయి? ఎలా సాధ్యమవుతుంది? తెలుసుకోవాలనుకుంటే ఈ వార్త చదవాల్సిందే.తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి లక్షలాది మంది జనం క్యూ కడుతుంటారు. ప్రతీ రోజు కనీసం లక్ష మంది జనం తిరుమలకు వస్తుంటారు. అందరికీ దర్శన భాగ్యం కలుగుతుందా అంటే సాధ్యం కాదు. ప్రత్యేక రోజుల్లో తప్ప 80 వేల మందికి అటు ఇటుగా దర్శన భాగ్యం కలుగుతుంది. మిగిలిన వాళ్ళు మరింత సమయం వేచి చూడాల్సిందే.తిరుమలలో ఆరు రకాల దర్శనాలు ఉన్నాయి. ఇవి కాకుండా సేవలూ ఉన్నాయి. మనం ఇప్పుడు కేవలం దర్శనాలలోని రకాల గురించే మాట్లాడుకుందాం.
*సర్వదర్శనం :
దీనికి ఎవరైనా వెళ్ళవచ్చు. వైకుంఠం క్యూ కాంప్లెక్సు చేరితే ఎటువంటి టోకెను లేకుండా గదుల్లోకి పంపుతారు. అక్కడ వేచి ఉండాల్సి ఉంటుంది. సమయాన్ని బట్టి రద్దీని బట్టి ఈ దర్శనంలో 2 గంటల నుంచి 24 గంటలకుపైగానే సమయం పట్టే అవకాశం ఉంది.
*ప్రత్యేక ప్రవేశ దర్శనం \ దీనినే ప్రత్యేక ప్రవేశ దర్శనం లేదా శీఘ్ర దర్శనం లేదా రూ. 300/- దర్శనం అంటుంటారు. దీనికి ముందుగా ఆన్‌లైన్ ద్వారాగానీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దర్శనం టికెట్టుపై ఉన్న నిర్ణీత సమయానికి సూచించిన ప్రదేశానికి వెళ్ళితే క్యూలైను వైకుంఠం కాంప్లెక్సుకు కలుపుతారు. ఇక్కడ కూడా రద్దీని అనుసరించి స్వామి దర్శనానికి వదులుతారు. ఈ సమయం ఎక్కవ సందర్భాలలో 1 గంట నుంచి 4 గంటల సమయం పడుతుంది.
*దివ్య దర్శనం
తిరుమలకు నడుచుకుని వెళ్ళే భక్తుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరు అలిపిరి లేదా శ్రీనివాసమంగాపురం సమీపంలోని శ్రీవారి మెట్టు మార్గం గుండా నడుచుకుని వస్తారు. వీరికి మార్గ మధ్యమంలో దర్శనానికి టోకెన్ కడతారు. టోకెన్‌లోని సమయాన్ని అనుసరించి వీరిని నిర్ణీత ప్రాంతం నుంచి దర్శనానికి వదులుతారు. ఈ విధానం ద్వారా వచ్చే వారికి కూడా ఎక్కువ సందర్భాలలో 1 నుంచి 4 గంటల లోపు దర్శన భాగ్యం కలుగుతుంది.
*వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతుల కేటగిరి
65 యేళ్ళ పైబడిని వృద్దులకు, వికలాంగులకు వేర్వేరుగా ప్రత్యేక దర్శనం కలిగిస్తారు. వీరు టీటీడీ నిర్ణయించిన సమయానికి, నిర్ణయించిన ప్రదేశానికి చేరుకుని తమ పేరును నమోదు చేసుకుని స్వామి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. వీరికి పెద్దగా సమయం పట్టదు. గంటలోపే దర్శన భాగ్యం కలుగుతుంది. ఏర్పాటు చేసిన వసతి ప్రదేశాలలో వేచి ఉండాల్సి ఉంటుంది.
* చంటి పిల్లలు/ ఎన్ఆర్ఐ కేటగిరి
చంటి పిల్లలు తల్లిదండ్రులు లేదా ఎన్నారైల కోసం కూడా ప్రత్యేక దర్శనాలుంటాయి. వీరి సుపథం మార్గం గుండి స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా పెద్దగా వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. వీరిని కూడా నిర్ధిష్ట సమయాలలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు.
* విఐపీ/ప్రొటోకాల్ దర్శనాలు
ఇవి సాధారణంగా ప్రజాప్రతినిధులు, వివిధ శాఖలకు చెందిన ఉన్నత అధికారులు ఇచ్చిన సిఫార్సు లేఖలు ఆధారంగా ప్రత్యేక టికెట్లపై ఈ దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ఈ విధానంలో టికెట్లు పొందిన వారు నిర్ణీత సమయానికి, నిర్ణీత ప్రదేశానికి అక్కడ చేరుకుని దర్శనానికి వెళ్ళాల్సం ఉంటుంది. ఈ తరహా కేటగిరిలో ఎక్కువ సమయంలో గంటలోపే దర్శన భాగ్యం కలుగుతుంది.
* టోకెన్ విధానం
భక్తులకు మరింత సులభతరంగా దర్శన భాగ్యం కల్గించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం టోకెన్ విధానంలో దర్శనం కలిగిస్తోంది. భక్తులు తిరుమల కొండ మీద వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి తిరుపతిలోనే టోకెన్ ఇస్తారు. ఈ టోకెన్‌లో ఏ సమయానికి దర్శనానికి అనుమతిస్తారే అంశం అచ్చయి ఉంటుంది. ఆ సమయానికి తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్సుకు చేరుకుంటే దర్శనానికి అనుమతి లభిస్తుంది. ఈ మార్గంలో కూడా చాలా తక్కువ సమయంలో స్వామి దర్శనం కలుగుతుంది.