Movies

ఆరేళ్ల కీర్తి

Keerthy Suresh Completes Six Years In Tollywood

వెండితెరపై అరంగేట్రం చేసిన అనతికాలంలోనే అద్భుతాభినయంతో ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది మలయాళ సుందరి కీర్తి సురేష్. చూడముచ్చటైన రూపం, ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే ప్రతిభాసంపత్తులతో దక్షిణాదిన ఆమె విశేషమైన అభిమానగణాన్ని సంపాదించుకుంది. ఈ సొగసరి చిత్రసీమలోకి అరంగేట్రం చేసి ఆదివారంతో ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టింది కీర్తి సురేష్. ఆరేళ్ల క్రితం ఇదే రోజున నటిగా జన్మించాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞురాలిని. కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులతో ఈ స్థాయికి చేరుకున్నాను. నా విజయంలో మీరందరూ భాగస్వాములే. నేను ప్రయాణించాల్సిన దూరం ఇంకా ఉంది. పాప్‌కార్న్ తింటూ మీ సీట్లలో రిలాక్స్‌గా కూర్చోండి అంటూ ఆ పోస్ట్‌లో కీర్తి సురేష్ పేర్కొంది. మలయాళ చిత్రం గీతాంజలి (2013)తో వెండితెరకు పరిచయమైంది కీర్తిసురేష్. నేను శైలజ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మహానటితో వరించిన జాతీయపురస్కారం కీర్తిసురేష్‌కు తిరుగులేని పేరుప్రఖ్యాతుల్ని సంపాదించిపెట్టింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో మైదాన్‌తో పాటు తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తున్నది.